కానిస్టేబుల్‌నంటూ ప్రేమ జంటపై దాడి

11 Aug, 2019 11:06 IST|Sakshi

సాక్షి, రాజేంద్రనగర్‌ : పోలీస్‌ కానిస్టేబుల్‌ని అంటూ గండిపేట పార్కులో ప్రేమజంటను భయబ్రాంతులకు గురి చేసి ఫొటోలు తీయడంతో పాటు నగదు లాక్కెళ్లిన దుండగుడిపై బాధితుడు నార్సింగి పోలీసులకు శనివారం ఉదయం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని రెడ్‌హిల్స్‌ ప్రాంతానికి చెందిన సయ్యద్‌ హుస్సేన్‌(21) విద్యార్థి. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో గండిపేట ప్రాంతానికి తన ప్రేయసితో కలిసి వచ్చాడు. పార్కు వద్ద ప్రేమికులిద్దరూ మాట్లాడుకుంటుండగా సివిల్‌ డ్రెస్‌లో వచ్చిన ఓ వ్యక్తి తాను నార్సింగి పోలీస్‌స్టేషన్‌ సివిల్‌ కానిస్టేబుల్‌ హుస్సేన్‌గా పరిచయం చేసుకున్నాడు. అనంతరం సాయంత్రం సమయంలో మీకేమి పని అంటూ వారి ఫొటోలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. అనంతరం వారి వివరాలను స్వీకరించి భయబ్రాంతులకు గురిచేశాడు. హుస్సేన్‌ దగ్గర ఉన్న రూ. 6500 నగదు లాక్కొని వెళ్లిపోయాడు. ఈ విషయమై సయ్యద్‌ హుస్సేన్‌ నార్సింగి పోలీసులకు శనివారం ఉదయం ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.     

మరిన్ని వార్తలు