మహానగరంలో ‘మాయగాడు’

2 May, 2019 13:05 IST|Sakshi
పోలీసులు అరెస్టు చేసిన కిలపర్తి సందర్శ్‌

నేవీ, రా ఏజెంట్‌ అంటూ మోసాలు

పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్‌ : మహానగరంలో మాయగాడు ఎట్టకేలకు పోలీసులకు దొరికిపోయాడు. విశాఖ కేంద్రంగా మోసాలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న మోసగాడిని ఏలూరు వన్‌టౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు. మెడికల్‌ సీటు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి రూ.15 లక్షలు కాజేసి చేతులెత్తేయటంతో బాధితుడు వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిని అరెస్ట్‌ చేశారు. వివరాలిలా ఉన్నాయి.. ఏలూరు శ్రీరామ్‌నగర్‌కు చెందిన పడాల సత్యనారాయణ కుమారుడు 2016లో ఎంసెట్‌ రాయగా పెద్ద ర్యాంకు వచ్చింది.

ఎలాగైనా తన కుమారుడిని డాక్టర్‌ చదివిం చా లని భావించిన సత్యనారాయణ ఏలూరు వన్‌టౌ న్‌కు చెందిన పోలీస్‌ కానిస్టేబుల్‌ సేనాపతి లక్ష్మీశ్రీ నివాస్‌ అశోక్‌ అల్లుడు కిలపర్తి సందర్శ్‌ను కలి శాడు. సందర్శ్‌ తాను విశాఖ నేవీలో కమాండర్‌గా ఉద్యోగం చేస్తున్నట్టు, తనకు బడా అధికారులు, రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నాయని, మెడికల్‌ సీటు కావాలంటే రూ.15 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని నమ్మించాడు. దీంతో సత్యనారాయణ తన ఇంటిని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి సందర్శ్‌కు ఇచ్చాడు. ఏలూరు ఆశ్రంలో మెడికల్‌ సీటు వచ్చేస్తుందని నమ్మించాడు. అయినా ఎంతకీ సీటు రాకపోవడంతో సత్యనారాయణ గతేడాది నవంబర్‌ 17న కేసు పెట్టాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సందర్శ్‌ను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరచగా, న్యాయమూర్తి అతడికి 14 రోజుల రిమాండ్‌ విధించారు.

రా ఏజెంట్‌ అంటూ నకిలీ గుర్తింపు కార్డులు
రా ఏజెంట్‌గా, ప్రధానికి సెక్యూరిటీగా ఉంటానంటూ, నేవీలో కమాండర్‌ని అంటూ నకిలీ గుర్తింపు కార్డులు చూపిస్తూ జనాలను మోసాలు చేయటం సందర్శ్‌ నైజం. ఏలూరులోనూ కొందరు యువకులు, వ్యక్తుల వద్ద డబ్బులు వసూలు చేసి మోసం చేశాడు. అయితే సందర్శ్‌ పోలీసు కానిస్టేబుల్‌ అల్లుడు కావటంతో పోలీసు అధికారులు అతడిపై ఈగ కూడా వాలనివ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి. సందర్శ్‌పై విశాఖ పట్నం టూటౌన్, మువ్వలపాలెంలో స్టేషన్లలోనూ కేసులు ఉన్నాయి.  

>
మరిన్ని వార్తలు