కూతుర్ని చంపిన కుటుంబం

1 Jul, 2020 08:29 IST|Sakshi
నిందితులు రామాంజినమ్మ(తల్లి), అశోక్‌ (అన్న), నేత్రావతి (అక్క), బాలకృష్ణ (బావ) 

తూముకుంటలో పరువు హత్య

సాక్షి, అనంతపురం : గౌరిబిదనూరు తాలూకాలోని హులికుంట గ్రామం చెరువులో జూన్‌ 26న లభ్యమైన గుర్తు తెలియని యువతి మృతదేహం కేసు మిస్టరీ వీడింది. ఇది ఒక కుటుంబమంతా కలిసి చేసిన పరువు హత్యగా పోలీసులు గుర్తించారు. వివరాలు.. అనంతపురం జిల్లా హిందూపురం మండలం తూముకుంట చెక్‌ పోస్ట్‌ దగ్గర నివాసముంటున్న రామాంజినమ్మ కుమార్తె సంధ్య(17), హిందూపురానికి చెందిన శేఖర్‌ ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ రెండు సార్లు ఇల్లు వదలి వెళ్లిపోగా తల్లి చేసిన ఫిర్యాదు మేరకు హిందూపురం పోలీసులు హైదరాబాదులో ఉన్న వీళ్లిద్దరినీ తెచ్చి అప్పగించారు. యువతి వల్ల తమ కుటుంబం ఇబ్బందులకు గురవుతోందని భావించిన తల్లి రామాంజినమ్మ, అన్న అశోక్, అక్క నేత్రావతి, ఆమె భర్త బాలకృష్ణ అందరూ కలిసి సంధ్యను అంతమొందించాలని పథకం రచించి హత్య చేశారు. మృతదేహానికి రాయి కట్టి చెరువులో పడేశారు. తరువాత తమ కుమార్తె కనిపించడం లేదని హిందూపురం పోలీస్‌ స్టేషనులో కేసు పెట్టారు. గౌరిబిదనూరు రూరల్‌ పోలీసులకు సమాచారం రాగా, చెరువులో దొరికిన యువతి ఆనవాళ్లతో సరిచూసి కేసును ఛేదించారు. సీఐ రవి, ఎస్‌ఐ మోహన్‌లు కేసు విచారించారు. 

>
మరిన్ని వార్తలు