రుణం..తీసింది ప్రాణం

4 Dec, 2019 07:10 IST|Sakshi
గోడపై రక్తంతో రాసిన మరణ వాంగ్మూలం, హత్యకు గురైన బిడ్డ

అప్పులు చేసి..తీర్చలేక

కుమారుడిని హత్య చేసి.. తల్లిదండ్రుల ఆత్మహత్య

తమిళనాడు,తిరువొత్తియూరు: మొదట బిడ్డను హత్య చేసి, ఆ తర్వాత తల్లిదండ్రులు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన నెల్‌లై జిల్లాలో చోటు చేసుకుంది. తెన్‌కాశి జిల్లా చెంగోట్టై సమీపం పులియరైకట్టులై నివాస ప్రాంతానికి చెందిన కందస్వామి (35). కూలీ కార్మికుడు. అతని భార్య ఇందుమతి (30), వీరి కుమారుడు చిన్న ముత్తిరన్‌ (6), రెండు సంవత్సరాల కుమార్తె వున్నారు. కందస్వామి పలువురి వద్ద అప్పు చేసినట్టు తెలిసింది. కూలీ పనులకు వెళ్లి కుటుంబం పోషించాల్సి రావడంతో అతను తీసుకున్న అప్పు తీర్చలేకపోయాడు. దీంతో రుణదాతలు ఒత్తిడి చేశారు. దీంతో విరక్తి చెందిన కందస్వామి, అతని భార్య సోమవారం రాత్రి భోజనం చేసి తరువాత కుమారుడికి అన్నం తినిపించారు.

తరువాత మనసును రాయి చేసుకుని మొదట కుమారుడిని గొంతు నులిమి హత్య చేశారు. దీని తరువాత రెండు సంవత్సరాల ఆడబిడ్డను గొంతు బిగించినట్టు తెలిసింది. ఆ బిడ్డ ఏడవడంతో ఆమెను వదలి పెట్టి ఇంటిలో వేరే వేరుగా ఫ్యాన్లకు కందస్వామి, అతని భార్య ఇందుమతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం ఉదయం చాలా సమయం అయినప్పటికీ వారి ఇంటి తలుపులు తెరచుకోకపోవడం ఇంటి నుంచి బిడ్డ ఏడుపు శబ్ధం వినబడటం చూశారు. ఆ సమయంలో భార్య, భర్త ఉరిలో శవాలుగా వేలాడుతున్నారు. పక్కన బాలుడు చిన్న ముత్తిరన్‌ శవంగా పడి వున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న పులియారై పోలీసులు అక్కడికి చేరుకుని ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని తెన్‌కాశి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాణాలకు పోరాడుతున్న చిన్నారిని చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో అనుమతించారు. పోలీసుల విచారణలో అప్పుల బాధతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తమ రక్తంతో గోడపై మరణ వాగ్మూలం రాశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు