అలహాబాద్ : ఉత్తరప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. ఒకరు ఫ్యాన్కు వేలాడుతూ కనిపించగా.. మరొకరి శవం ఫ్రిజ్లో, ఇద్దరి శవాలు సూటుకేసులో, ఇంకొకరిది బీరువాలో లభించాయి. మృతదేహాలు అలహాబాద్లోని ధుమాన్గంజ్ చెందిన మనోజ్ కుష్వాహ(35), అతడి భార్య, వారి ముగ్గురు పిల్లలవిగా పోలీసులు గుర్తించారు.
భార్యపై అనుమానంతో భర్తే..
గత మూడు రోజులుగా మనోజ్ కుష్వాహా ఇంటి తలుపులు తెరవకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇంటి లోపలికి వెళ్లి చూడగా మనోజ్ ఫ్యాన్కు వేలాడుతూ కన్పించాడు. అతడి భార్య మృతదేహం వేరే గదిలో ఉన్న ఫ్రిజ్లో, ఇద్దరు పిల్లల శవాలు సూట్కేసులో, మరో పాప శవం బీరువాలో లభించాయి. భార్యా పిల్లలను హత్య చేసి మనోజ్ ఈ ఘాతుకానికి పాల్పడివుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. తన భార్యపై అనుమానంతోనే అతడు ఇంత దారుణానికి ఒడిగట్టివుంటాడని భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.