రోడ్డు ప్రమాదంలో కుటుంబం దుర్మరణం

23 Jun, 2018 01:29 IST|Sakshi
మృతులు అరుణ్‌కుమార్, కూతురు, కుమారుడు, భార్య సౌమ్య (ఫైల్‌)

      ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు 

      ఒకే కుటుంబానికి  చెందిన నలుగురి మృతి 

సాక్షి,పెద్దపల్లి/సుల్తానాబాద్‌: రోడ్డు ప్రమాదం నిండు కుటుంబాన్ని బలితీసుకుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం కాట్నపల్లి గ్రామం వద్ద రాజీవ్‌ రహదారిపై గురువారం రాత్రి 1.30 ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై నిలిచి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో కారు నడుపుతున్న చదువాల అరుణ్‌కుమార్‌ (37) భార్య సౌమ్య (30), కుమారుడు అఖిలేశ్‌ (9), కూతురు శాన్వీ(5) దుర్మరణం చెందారు. కారు ప్రమాదానికి గురికాగానే, సమీపంలోని రైస్‌మిల్లు సిబ్బంది, గ్రామస్థులు వారిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. అయితే కారు నుజ్జునుజ్జు  కావడంతో వారిని బయటకు తీయడం కష్టంగా మారింది. అప్పటికే అరుణ్‌కుమార్, భార్య, కూతురు మృతి చెందగా, కొన ఊపిరితో ఉన్న బాలుడిని కరీంనగర్‌ ఆసుపత్రికి తరలించగా, అక్కడ మరణించాడు.

అరుణ్‌ మంథనిలోని కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నాడు. గురువారం హైదరాబాద్‌లోని ఇబ్రహీంపట్నంలో తన సోదరు డు సాయికుమార్‌ బావమరిది ఓం ప్రకాశ్‌ను పాలిటెక్నిక్‌ కళాశాలలో చేర్చి రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. శుక్రవారం ఉదయం పాఠశాలకు వెళ్లాలని రాత్రే బయలుదేరినట్లు బంధువులు చెప్పారు. ఈ క్రమంలో కాట్నపల్లి వద్ద  వీరి కారు రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. మృతదేహాలను బయటకు తీసేందుకు పోలీసులు 4 గంటలు  శ్రమి ంచారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుల్తానాబాద్‌ ట్యాం క్‌ రోడ్‌కు చెందిన అరుణ్‌ కుటుంబం 6 ఏళ్ల క్రితం మంథనిలో స్థిరపడింది.

మరిన్ని వార్తలు