బంధాలను కాలరాసి.. కత్తులతో దాడిచేసి..

16 Dec, 2019 12:42 IST|Sakshi
సంఘటనా స్థలంలో పడి ఉన్న శ్రీను, సుజాత

కుటుంబసభ్యుల మధ్య పొలం తగాదా

ముగ్గురికి తీవ్రగాయాలు రెండు బైక్‌లు దగ్ధం

పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల : పొలం తగాదా నేపథ్యంలో ఒక కుటుంబంలోని సభ్యులు ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్న సంఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా రెండు ద్విచక్రవాహనాలు బుగ్గయ్యాయి. మండలంలోని రామన్నగూడెం పంచాయతీ నాగేశ్వరరావుమెట్ట వద్ద ఆదివారం జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గొర్రెల లక్ష్మణస్వామి ముగ్గురు కుమారులు శ్రీను, సత్యనారాయణ, పల్లయ్య పదేళ్ల క్రితం దుబాయి వెళ్లి అక్కడ సంపాదించిన సొమ్మును తండ్రికి పంపారు. ఈ మొత్తంతో లక్ష్మణస్వామి ఇక్కడ మూడున్నర ఎకరాల భూమిని తన పేరున కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు.

దుబాయి నుంచి కుమారులు వచ్చిన తర్వాత ఆ భూమిని అందరూ పంచుకుని సాగు చేసుకుంటున్నారు. ఈనేపథ్యంలో దాదాపు ఏడాదిన్నర క్రితం తండ్రి లక్ష్మణస్వామిని బ్యాంకు రుణం నిమిత్తం సంతకం పెట్టాలని శ్రీను అత్తిలి తీసుకెళ్లి మొత్తం భూమిని తన పేరున రిజిస్టర్‌ చేయించుకున్నాడు. దీనిపై పోలీస్టేషన్‌లో కేసులు, ఆర్డీఓ కోర్టులో వ్యాజ్యం నడవగా దస్తావేజు రద్దుకు ఆర్డీఓ సిఫార్సు చేశారు. అనంతరం ఎవరి వాటాల్లో వారు వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. ఆదివారం లక్ష్మణస్వామి, పల్లయ్య వారి భూమి లో వ్యవసాయ పనులు చేస్తుండగా శ్రీను, అతడికి సంబంధించిన వ్యక్తు లు వీరి ద్విచక్రవాహనాలకు పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. లక్ష్మణస్వామిపై కత్తులతో దాడికి దిగారు. విషయం తెలిసి సత్యనారాయణ, మిగిలిన కుటుంబసభ్యులు కూడా పొలానికి చేరుకున్నారు. ఈ సమయంలో ఒకరిపై ఒకరు కత్తులతో దాడిచేసుకోవడంతో శ్రీను, అతని భార్య సుజా త, సత్యనారాయణకు తీవ్రగాయాలయ్యాయి. బాధితులను హుటాహుటిన స్థానికులు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు