టీడీపీ నేతల తీరుతో మనస్తాపం
అనంతపురం, కొత్తచెరువు: టీడీపీ నాయకుల స్వార్థం ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి దారితీసింది. మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మరకుంటపల్లికి చెందిన రైతు లక్ష్మిరెడ్డి తన ఇంటి సమీపంలోని సొంత స్థలంలో జియో కంపెనీ వారు సెల్టవర్ నిర్మాణం చేపట్టేందుకు ముందుకు వచ్చారు. టవర్ ఏర్పాటుకు ఒప్పుకుంటే కొంత సొమ్ము ఇస్తామని చెప్పడంతో కుటుంబ పోషణకు ఉపయోగపడుతుందని రైతు ఒప్పుకున్నాడు.
ఈ మేరకు టవర్ ఏర్పాటుకు కంపెనీ వారు గుంత తీయించి బెడ్డింగ్ వేయించారు. అయితే స్థానిక టీడీపీ నాయకులైన మాజీ సర్పంచ్ రమేష్రెడ్డి, ఆయన సోదరుడు కేశవరెడ్డిలు విషయం తెలుసుకుని ఆ ఆదాయానికి గండికొట్టారు. అధికారుల ద్వారా టవర్ నిర్మాణానికి అడ్డంకులు సృష్టించారు. వరుస కరువులతో పంటలు చేతికందక నష్టాలు చవిచూసిన రైతు.. ఇప్పుడు టవర్ ద్వారా వస్తుందనుకున్న ఆదాయాన్ని కూడా టీడీపీ నేతల స్వార్థం కారణంగా కోల్పోవాల్సి వస్తుండటంతో మనస్తాపం చెందాడు. సోమవారం ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని వెంట తెచ్చుకున్న పెట్రోలును ఒంటిపై పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఇంతలో అక్కడున్న వారు అతడి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అధికారులు స్పందించి తన స్థలంలో టవర్ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని రైతు కోరాడు.