అప్పులు చేసిన రైతు
తీర్చలేక బలవన్మరణం
దొడ్డబళ్లాపురం: వ్యవసాయంలో లాభాలు రావడంలేదని భావించిన ఒక రైతు కనీసం పేకాటలో సంపాదించాలని పీకలదాకా అప్పులు చేసి చివరకు అక్కడా గెలవలేక బలవన్మరణం చెందిన సంఘటన మంగళవారం దొడ్డ తాలూకా తపసీహళ్లిలో చోటు చేసుకుంది. రైతు సుభాష్చంద్ర (42) సుభాష్చంద్ర మొదటి నుండి వ్యవసాయం చేస్తున్నా, నష్టాలపాలవుతుండడంతో కష్టాలు గట్టెక్కాలనే తపనతో కొందరు జూదరుల స్నేహం చేసి పేకాట ఆడి గెలవాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా వారానికి రూ.10లు చొప్పున వడ్డీకి రూ.2,20,000 తీసుకున్నాడు. కొద్ది రోజుల్లోనే మొత్తం సొమ్ము ఖాళీ అయింది. దీంతో అటు వడ్డీ కూడా కట్టలేని స్థితికి వచ్చాడు. వడ్డీ ఇవ్వాలని అప్పు ఇచ్చిన వారు వేధిస్తుండడంతో మనస్తాపంతో మంగళవారం తన పొలంలోనే చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఒక మగ, ఒక ఆడ పిల్ల ఉన్నారు. గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.