-

ఉసురుతీసిన అప్పులు

26 Dec, 2018 13:16 IST|Sakshi
ఆంజనేయులు మృతదేహం, ఆంజనేయులు(ఫైల్‌)

అక్కన్నపేట(హుస్నాబాద్‌): జీవనోపాధి కోసం చేసిన అప్పులు తీర్చలేక ఓ వ్యక్తి ప్రాణాలు తీసిన సంఘటన ధర్మారంలో విషాదాన్ని నింపింది. మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన నాంపెల్లి ఆంజనేయులు(25) అనే యువకుడు వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగి మృతి చెందాడు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం తనకున్న ఎకరంన్నర వ్యవసాయ భూమిలో సాగు చేసుకుంటున్నాడు. రూ.3 లక్షలు అప్పులు చేసి బోరు వేయించాడు. అవి ఫెయిల్‌ కావడంతో మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేశాడు. వర్షాలు సకాలంలో పడక పెట్టిన పెట్టుబడులు రాని దయనీయ పరిస్థితులతో కుంగిపోయాడు. జీవనం సాగించేందుకు మరో రూ.2లక్షలు అప్పులు చేసి రెండు ఆటోలను కొన్నాడు. సుమారుగా రూ.5లక్షల వరకు అప్పులయ్యాయి.

ఆటోలకు  గిరాకీ లేక చేసిన అప్పులకు 
వడ్డీలు పెరిగిపోయాయి. దీంతో నిత్యం మనస్థాపంతో ఉండేవాడు. ఈ క్రమంలో చివరికి సోమవారం రాత్రి వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగి తనవు చాలించాడని కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు బోరుమంటున్నారు. మృతుడి భార్య శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ మణెమ్మ చెప్పారు. మృతిడికి భార్యతో పాటు కుమారుడు ఉన్నాడు.

మరిన్ని వార్తలు