సోషల్ మీడియాలో ‘అనంత’ రైతు ఆవేదన
గుంతకల్లు రూరల్: ‘‘ఆరుగాలం శ్రమించి పండించిన పంట భారీ వర్షాల కారణంగా కళ్ల ముందే నీటమునిగిపోతే పట్టించుకున్న అధికారులు లేరు. పుట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ పార్టీకి సేవ చేసినా నేతలకు కనికరం లేదు. రైతు సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతున్నామని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నా, రైతులకు ఎలాంటి మేలు చేకూరలేదు. పంటనష్టంతో ఏటా అప్పుల పాలవ్వడమే తప్ప మమ్మల్ని ఆదుకునే దిక్కులేదు.
ఈ స్థితిలో బతికి బాధపడటం కంటే చావే శరణ్యమనిపిస్తోంది. అధికారులు, పాలకుల నిర్లక్ష్యం, వేధిస్తున్న పంటనష్టం.. భరించలేక భార్యాపిల్లలతో కలసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమయ్యాను’’ అంటూ అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం దోసలుడుకి గ్రామ రైతు కొమ్మె నాగప్ప ఇటీవలే సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశాడు. శనివారం దీన్ని చూసి స్పందించిన బీజేపీ కిసాన్ మోర్చా కర్నూలు జిల్లా అధ్యక్షుడు నవీన్కుమార్.. వెంటనే గుంతకల్లు వ్యవసాయ శాఖ, రెవెన్యూ, హార్టికల్చర్ అధికారులకు సమాచారమిచ్చారు. అధికారులు హుటాహుటిన గ్రామానికి చేరుకుని బాధితునితో చర్చలు చేపట్టారు.