విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి

23 Oct, 2018 10:12 IST|Sakshi
భీంసాగర్‌ మృతిచెందిన ప్రదేశాన్ని పరిశీలిస్తున్న సీఐ బాలాజీ అయిలి విజయ్, భీంసాగర్‌ మృతదేహాలు

గూడూరు(మహబూబాబాద్‌): విద్యుదాఘాతంతో ఇద్దరు యువకులు మృత్యువాత పడిన సంఘటన మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలంలో వేర్వేరు చోట్ల జరిగింది. ఎస్సై ఎస్‌కే.యాసిన్‌ కథనం ప్రకారం... బొద్దుగొండకు చెందిన అయిలి విజయ్‌(25) తండ్రి పుల్లయ్యతో కలిసి గ్రామ శివారులోని వరి పొలానికి నీరు పారించేందుకు సోమవారం వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. విజయ్‌ విద్యుత్‌ మోటార్‌ ఆన్‌ చేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై పడిపోయాడు. ఇది చూసిన తండ్రి కేకలు వేయడంతో సమీపంలోని రైతులు వచ్చి మానుకోట ఆస్పత్రికి తరలించారు.

చికిత్సపొందుతూ కొద్ది సేపటికే మృతిచెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, మట్టెవాడ శివారు పరికల తండాలో ఆదివారం రాత్రి బానోతు భీంసాగర్‌(20) సమీపంలోని పంట పొలానికి నీరు పారించడానికి వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. పొలంలోని ఓ గట్టుపై స్తంభానికి మినీ ట్రాన్స్‌ఫార్మర్‌ ఉంది. దాని సప్లయ్‌ రాడ్‌ను పక్కకు తిప్పే క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న సీఐ బాలాజీ, ఎస్సై యాసిన్‌ సోమవారం వెళ్లి పరిశీలించారు. విద్యుత్‌ శాఖ ఏఈ వివరాలు సేకరించారు. మృతుడి తల్లి బానోతు సోనా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. 

మరిన్ని వార్తలు