సమత కేసు డిసెంబర్‌ 26కి వాయిదా

24 Dec, 2019 13:32 IST|Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: జిల్లాలోని లింగాపూర్‌ మండలం ఎల్లాపటార్‌లో అత్యాచారం, హత్యకు గురైన సమత కేసు విచారణ రెండోరోజు ప్రారంభమైంది. ఈ కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సమత కేసులో రెండో రోజు సాక్షులను పోలీసులు మంగళవారం కోర్టుహాల్‌లో ప్రవేశపెట్టారు. దీంతో కోర్టులో సమత కేసు సాక్షుల విచారణ కొనసాగింది. కాగా సోమవారం ఏడుగురు సాక్షులను విచారించాల్సి ఉండగా.. కేవలం మృతురాలి భర్త, దగ్గరి బంధువును మాత్రమే ప్రత్యేక కోర్టు విచారించింది. తొలిరోజు మిగిలిన ఐదుగురితోపాటు.. షెడ్యూల్‌ ప్రకారం మంగళవారం సాక్ష్యం చెప్పాల్సిన ఏడుగురు, మొత్తంగా 12 మందిని కోర్టు విచారించనున్నది.

డిసెంబర్‌ 31 వరకు సాక్షులను విచారించి వారి స్టేట్‌మెంట్‌ను ప్రత్యేక కోర్టు రికార్డు చేయనున్నది. తర్వాత పోలీసులు నమోదు చేసిన డీఎన్‌ఏ, ఎఫ్‌ఐఆర్‌ , ఇతర ఆధారాలు, సాక్షాధారాలు పరిశీలించి జనవరి మొదటి లేదా రెండో వారంలో ఆదిలాబాద్‌ ప్రత్యేక కోర్టు తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రత్యేక కోర్టుకు వరంగల్‌ రేంజ్‌ ఐజీ నాగిరెడ్డి వెళ్లారు. ఈ రోజు ఆదిలాబాద్‌ వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌ను పరిశీలించడానికి ఆయన వచ్చినట్లు తెలుస్తోంది. దీంతోపాటు కోర్టులో సమత కేసు విచారణ కూడా జరుగుతుండటంతో ఐజీ నాగిరెడ్డి ప్రత్యేక కోర్టుకు వెళ్లారు. రెండో రోజు విచారణ అనంతరం సమత కేసును ప్రత్యేక కోర్టు గురువారానికి (డిసెంబర్‌ 26) వాయిదా వేసింది. 

>
మరిన్ని వార్తలు