తిరునాళ్లకు వచ్చి.. మృత్యుఒడికి

22 Mar, 2019 13:46 IST|Sakshi
మృతి చెందిన ఓబుల్‌రెడ్డి, భార్గవి

ఆర్టీసీ బస్సు ఢీ బాబాయ్, కూతురు మృతి

ద్విచక్రవాహనంపై వెళుతుండగా దుర్ఘటన

రాయచోటి టౌన్‌ : చిన్నమండెం మండలం మల్లూరులో మల్లూరమ్మ తిరునాళ్లకు వచ్చిన ఇద్దరు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. స్థానికులు, పోలీసుల కథనం.. వల్లూరు మండలం నాగిరెడ్డిగారిపల్లెకు చెందిన ఎం.ఓబుల్‌రెడ్డి (48) తిరునాళ్లకోసం ఈనెల 20న మల్లూరుకు వచ్చారు. అదేరోజున తన తోడల్లుడి కుమార్తె భార్గవి, అల్లుడు మహేశ్వరరెడ్డి కూడా గుర్రంకొండ నుంచి వచ్చారు. భార్గవి డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతోంది. గురువారం రాయచోటిలో పరీక్ష రాయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తనకు రాయచోటిలో పని ఉందని, తానే భార్గవిని తీసుకెళ్తాంటూ ఓబుల్‌రెడ్డిని ఆమెను తీసుకుని బైక్‌లో బయల్దేరారు. రాయచోటి సమీపంలోని ఏజీ గార్డెన్‌ మలుపువద్ద మృత్యువాత పడ్డారు.  కడప నుంచి బెంగళూరు వెళుతున్న అమరావతి బస్సు వారిని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓబుల్‌రెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన భార్గవిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు