భార్యపై అనుమానంతో చిన్నారి ఉసురు తీశాడు..

14 Jun, 2020 05:01 IST|Sakshi
నిందితుడు నాగేశ్వరరెడ్డి, సందీప్‌రెడ్డి (ఫైల్‌)

కర్నూలు జిల్లాలో ఓ తండ్రి ఘాతుకం 

సి.బెళగల్‌: భార్యపై అనుమానం అతడిని ఉన్మాదిలా మార్చింది. తనకు పుట్టలేదంటూ 18 నెలల చిన్నారిని కిరాతకంగా చంపాడు. కర్నూలు జిల్లా సి.బెళగల్‌ మండలం చింతమానుపల్లెలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన నాగేశ్వరరెడ్డికి, కర్ణాటకకు చెందిన సరితకు ఏడేళ్ల కిందట వివాహమైంది. వీరికి యశ్వంత్‌ (5), సందీప్‌రెడ్డి (18 నెలలు) అనే ఇద్దరు కుమారులున్నారు. 

► గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మాట విని నాగేశ్వరరెడ్డి తన భార్యపై అనుమానం పెంచుకుని చిన్న కుమారుడు తనకు పుట్టలేదని భావించాడు. 
► ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఇంటి ముందు కుటుంబ సభ్యులందరూ నిద్రిస్తుండగా.. తల్లి పక్కన నిద్రిస్తున్న సందీప్‌రెడ్డిని ఇంట్లోకి తీసుకెళ్లాడు. 
► చిన్నారి ఏడుపు విన్న కుటుంబ సభ్యులు లేచేసరికి తలుపులు వేసి లోపల గడియ పెట్టుకుని అతి కిరాతకంగా చిన్నారి గొంతు కోశాడు. అనంతరం తలుపులు తీసి బయటకు పరుగుదీశాడు. 
► అప్పటికే రక్తపు మడుగులో ఉన్న చిన్నారి కొద్దిసేపటికే తుదిశ్వాస విడిచాడు. తర్వాత నాగేశ్వరరెడ్డి పోలీసులకు లొంగిపోయాడు. భార్య ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేసినట్టు కోడుమూరు సీఐ పార్థసారథి, ఎస్‌ఐ రాజకుళ్లాయప్ప చెప్పారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.

మరిన్ని వార్తలు