కోల్కతా: ఫేస్ మాస్క్ పెట్టుకోడానికి నిరాకరిస్తున్నాడని కన్న కొడుకుని హతమార్చాడో తండ్రి. ఈ దారుణ ఘటన శనివారం కోల్కతాలో చోటు చేసుకుంది. ఉత్తర కోల్కతాలోని శోవాబజార్లో బన్సీదార్ మాలిక్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతనికి దివ్యాంగుడైన ఓ కొడుకున్నాడు. ఇదిలా వుండగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఫేస్ మాస్క్ తప్పనిసరని అధికారులు సూచిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతని కుమారుడు ముఖానికి ఎలాంటి మాస్కు ధరించకుండానే బయట తిరుగుతున్నాడు. లాక్డౌన్ సమయంలో బయటకు వెళ్లడమే తప్పంటే, పైగా మాస్కు ధరించకుండా తిరగడమేంటని.. పలుసార్లు చెప్పేందుకు ప్రయత్నించాడు. (పోలీసులంటే జనాల్లో ఉండే జవాన్లు..)
అయినప్పటికీ అతని మాటలను బేఖాతరు చేస్తూ అతని కుమారుడు శనివారం మరోమారు మాస్కు కట్టుకోకుండా బయటకు వెళ్లాడు. దీంతో ఆగ్రహం చెందిన బన్సీదార్.. కొడుకు ఇంటికి రాగానే నిలదీశాడు. ఈ క్రమంలో ఇద్దరికీ మాటామాటా పెరగడంతో పెద్ద గొడవగా మారింది. సహనం కోల్పోయిన తండ్రి ఆవేశంలో కొడుకును గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం రాత్రి 7 గంటల ప్రాంతంలో పోలీసు స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (అంధులకు సవాల్గా మారిన భౌతిక దూరం)