పెళ్లింట్లో విషాదం

9 Apr, 2018 12:37 IST|Sakshi
సాంబయ్య (ఫైల్‌)

కూతురి వివాహం జరిగిన రాత్రే తండ్రికి గుండెపోటు

ములుగురూరల్‌: పెళ్లి ఇంట్లో విషాదం చోటు చేసుకున్న సంఘటన మండలంలోని పత్తిపల్లి పంచాయతీ పరిధి చింతలపల్లిలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి... చింతలపల్లి గ్రామానికి చెందిన నాంపెల్లి సాంబయ్య(55), రాజమ్మ దంపతులకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఇందులో ముగ్గురు కుమార్తెలకు గతంలో వివాహం జరిగింది. నాల్గో కుమార్తె జ్యోతికి శనివారం వివాహం జరిగింది. శుభాకార్యం ముగిసిన అనంతరం వధూవరులను అత్తారింటికి సాగనంపారు.

రాత్రి నిద్రిస్తున్న సమయంలో సాంబయ్యకు సుమారు 2 గంటల ప్రాంతంలో గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. దీంతో పెళ్లికి వచ్చిన బంధువులు ఆస్పత్రి ఆవరణలో చేసిన రోదనలు మిన్నంటాయి. ఆదివారం అబ్బాయి ఇంట్లో రిసెప్షన్‌కు ఏర్పాట్లు కావడంతో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో చింతలపల్లితో పాటు అబ్బాయి గ్రామంలో  విషాదఛాయలు అమలుకున్నాయి. 

మరిన్ని వార్తలు