కొడుకుని చంపిన తండ్రికి జీవిత ఖైదు

21 Nov, 2019 10:28 IST|Sakshi

సాక్షి, ఒంగోలు సెంట్రల్‌: కొడుకును చంపిన కేసులో ఓ తండ్రికి యావజ్జీవ జైలు శిక్షను విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.వి జ్యోతిర్మయి బుధవారం తీర్పు చెప్పారు. సంతమాగులూరు మండలం వెలల్లచెరువుకు చెందిన కొశ్చిరి బ్రహ్మనాయుడు అనే వ్యక్తి కూలీ పని చేసుకుంటూ తన ఇద్దరి కుమారులతో కలిసి నివసిస్తుంటాడు. పెద్ద కొడుకు కొశ్చిరి సంపత్‌కుమార్‌ గుంటూరులో ఎల్‌ఇడీ టీవీలను శుభకార్యాలకు సరఫరా చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో 2018వ సంవత్సరం జనవరి 13న బ్రహ్మనాయుడు ఇంట్లో దాచిపెట్టిన రూ.5000 కనిపించడంలేదని, తన కొడుకు సంపత్‌ను అడిగి, గొడవ పెట్టుకున్నాడు. అనంతరం అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో ఊరిలోని అంగన్‌ వాడీ కేంద్రం పక్కనే ఉన్న బెంచీపై నిద్రపోతున్న సంపత్‌ను రోకలిబండతో కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు.

ఈ విషయాన్ని నిందితుడు గుంటూరులో ఉన్న తన బంధువు రాజేష్‌కు సమాచారం అందించడంతో రాజేష్‌ నిందితుడి చిన్న కొడుకు సందీప్‌ కుమార్‌కు సమాచారం అందించడంచాడు. దీంతో సందీప్‌ పోలీసులకు ఫిర్మాదు చేయడంతో నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. సందీప్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. జిల్లా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఎస్‌. శివరామకృష్ణ ప్రసాద్‌ నిందితుడికి శిక్ష పడేలా ప్రాసిక్యూషన్‌ వాదనలను వినిపించారు. కోర్టులో నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్ష విధిస్తూ యావజ్జీవజైలు శిక్షతో పాటు రూ. 1000 జరిమాన విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు.

 

మరిన్ని వార్తలు