కన్నతండ్రే కాలయముడయ్యాడు.. 

13 Nov, 2018 02:54 IST|Sakshi

3 నెలల చిన్నారిని చంపిన తండ్రి

చౌటుప్పల్‌: ఆ చిన్నారి పాలిట కన్నతండ్రే కాలయముడయ్యాడు.. భార్యపై ఉన్న కోపాన్ని పసిబిడ్డపై చూపించాడు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం కొయ్యలగూడెంలో సోమవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. మండలంలోని దేవలమ్మనాగారం గ్రామానికి చెందిన సిలివేరు శివకు హైదరాబాద్‌లోని రామంతపూర్‌కు చెందిన అక్షరతో ఏడాది క్రితం వివాహం జరిగింది. పెళ్లి అయిన నాటినుంచే శివ, భార్యపై అయిష్టంగా ఉంటున్నాడు. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.

ఈక్రమంలో అక్షర గర్భం దాల్చింది. ఈ విషయం నచ్చని శివ అబార్షన్‌ చేసుకోవాలంటూ ఒత్తిడి చేశాడు. దీనికి ఆమె ఒప్పుకోక మొదటి కాన్పు కావడంతో ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లింది. 3 నెలల క్రితం పాపకు జన్మనిచ్చింది. ఆ పాపకు నిహారిక అని పేరు పెట్టారు. ఇటీవల అక్షర బిడ్డతో కలసి భర్త వద్దకు వచ్చింది. ఆదివారం భార్యాభర్తలు మళ్లీ గొడవపడ్డారు. కొద్ది సేపటి తర్వాత అక్షర పడక గది నుంచి బయటకు వెళ్లింది. అంతలోనే శివ, పసిపాప నిహారిక గొంతు నులుముతుండటం చూసి వెంటనే బిడ్డను లాక్కుంది. అప్పటికే చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. పాపను హుటాహుటిన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని కామినేని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున పాప మృతిచెందింది.  

మరిన్ని వార్తలు