కూతురిని నరికి చంపిన తండ్రి

18 Oct, 2017 11:17 IST|Sakshi

సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో దారుణం చోటుచేసుకుంది. ఎండ్రీయాల్ గ్రామంలో పదో తరగతి చదువుతున్న తన కూతురు శ్రీజను, కన్న తండ్రే గొడ్డలితో నరికి చంపేశాడు. సంఘటన సమయంలో కన్న తల్లి ఇంట్లో లేదు. బంధువుల ఇంటికి వెళ్లి రాత్రి వచ్చేసరికి కూతురు పడిపోయి ఉంది. అయితే కూతురు పడుకుంది అని తల్లి భావించింది. ఉదయం ఎంతకూ నిద్ర లేవకపోవడంతోపాటు రక్తపు మడుగు కనిపించడంతో తల్లి సాయవ్వ షాక్‌కు గురైంది. తండ్రి బాల్‌రాజు పరారీలో ఉన్నాడు.

కన్న తండ్రే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని స్థానికులు చెబుతున్నారు. తండ్రి పరారీలో ఉండటంతో సంఘటనకు కారణం ఇంకా బయట పడలేదు. శ్రీజ స్కూల్ యూనిఫాంతోనే ఉండటం, రక్తపు మడుగులో ఉండటం చూసి అందరూ చలించిపోయారు. తాడ్వాయి ఎస్సై అంజయ్య, సదాశివనగర్  సీఐ నాగరాజు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. బాల్ రాజు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మానసిక పరిస్థితి సరిగా లేదని కూడా స్థానికులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు