పెంపుడు కూతుర్ని కాల్చి చంపిన తండ్రి..!

10 Aug, 2018 14:32 IST|Sakshi
మమత, సోంబిర్‌ పెళ్లి ఫొటో

చండీగఢ్‌ : పంజాబ్‌లో ఘోరం చోటుచేసుకుంది. దళిత యువకున్ని పెళ్లిచేసుకుందని అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురుని కాల్చిచంపాడో కసాయి తండ్రి. ఈ ఘటన రోహ్‌తక్‌ కోర్టు ప్రాంగణంలో చోటుచేసుకోవడం గమనార్హం. కాగా, ఆమెకు రక్షణగా ఉన్న పోలీస్‌ ఇన్స్‌పెక్టర్‌ కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. 

వివరాలు.. బావమరిది కూతురు మమతను రమేష్‌ 2002లో దత్తత తీసుకున్నాడు. మమత సోంబిర్‌ అనే దళిత యువకున్ని ప్రేమించారు. గతేడాది ఆగస్టులో ఇంటినుంచి వెళ్లిపోయి అతన్ని పెళ్లి చేసుకున్నారు. దీన్ని తీవ్ర అవమానంగా భావించిన రమేష్‌ తన మైనర్‌ కూతురుకు మాయమాటలు చెప్పి సోంబిర్‌ ఇంచి నుంచి తీసుకుపోయాడని కేసు పెట్టి అరెస్టు చేయించాడు. అయినప్పటికీ మమత ఇంటికి రాలేదు. 

ఇదిలా ఉండగా.. సోంబిర్‌పై కేసు విచారణ సందర్భంగా బుధవారం కోర్టుకి వస్తున్న మమతను రమేష్‌ ఇంటికి రావాల్సిందిగా కోరాడు. కానీ, ఆమె ససేమిరా అనడంతో కోపోద్రిక్తుడయ్యాడు. తమకళ్లెదుటే ‘మరో రెండు గంటల్లో నిన్ను చంపేస్తా’నంటూ రమేష్‌ హెచ్చరించినట్టు పోలీసులు వెల్లడించారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన మమతపై మోటర్‌ సైకిళ్లపై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారనీ, పక్కనే ఉన్న ఇన్స్‌పెక్టర్‌ నరేందర్‌ కూడా కాల్పుల్లో గాయపడి మరణించాడని పోలీసులు వెల్లడించారు. మమత మైనారిటీ మరో కొద్దిరోజుల్లో తీరిపోనుండడంతో రమేష్‌ ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు