మళ్లీ కూతురే..! బయటపడ్డ తండ్రి రాక్షసత్వం

25 Jul, 2018 20:27 IST|Sakshi
కాన్పు అనంతరం శిశువుతో.. తల్లి అనిత, ఆస్పత్రి సిబ్బంది, తదితరులు

కూతురుని పురిట్లోనే చంపేసిన కసాయి తండ్రి

సాక్షి, మహబూబాబాద్‌: మానవత్వం మంట గలిసింది. మహిళలు, శిశువులపై దేశవ్యాప్తంగా రోజురోజుకు అకృత్యాలు పెరిగిపోతుండగా.. మరోవైపు మగ సంతానం కోరుకుంటూ కసాయి తండ్రులు, కుటుంబ సభ్యులు ఆడశిశువు అని తెలియగానే పురిట్లోనే తమ బిడ్డను కడతేర్చుతున్నారు. భ్రూణహత్యలకూ పాల్పడుతున్నారు. తాజాగా.. మూడో కాన్పూలోనూ కూతురే పుట్టిందని ఓ తండ్రి మానవత్వాన్ని మరచి ప్రవర్తించాడు. అప్పుడే పుట్టిన బిడ్డను పొట్టనబెట్టుకున్నాడు. ఈ ఘటన జిల్లాలోని నెల్లికుదురు మండలం మెతిరాజుపల్లిలో కట్టకాలువ తండాలో చోటుచేసుకుంది.

వివరాలు.. కట్టకాలువ తండాకు చెందిన భానోత్‌ అనిత, ఈశ్వర్‌ దంపతులు. వారికి ఇద్దరు కూతుళ్లు. మూడో కాన్పులోనైనా కొడుకు పుడతాడని భావించారు. అనిత పురుడు కోసం వరంగల్‌ రూరల్‌ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బుధవారం భర్తతో సహా వచ్చారు. అయితే, మూడో కాన్పులో సైతం కూతురు పుట్టడంతో.. ఈశ్వర్‌ తనకు కూతురు వద్దని చెప్పినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఎంత చెప్పినా వినకుండా ఆస్పత్రి నుంచి భార్య, అప్పుడే పుట్టిన పసికందును తీసుకొని సొంతూరుకు చేరుకున్న ఈశ్వర్‌ పసికందు ప్రాణాలు తీసినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు