మామ లైంగిక వేధింపులు.. కోడలి ఆత్మహత్య

6 Mar, 2020 07:42 IST|Sakshi

ఖైరతాబాద్‌: మామ లైంగిక వేధింపులు తాళలేక కోడలు ఆత్మహత్య చేసుకుంది.ఈ సంఘటన సైఫాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన మేరకు.. బషీర్‌బాగ్‌లోని పూల్‌ బాగ్‌కు చెందిన కె.ప్రియాంక (25), లోయర్‌ ట్యాంక్‌బండ్, గాంధీనగర్‌కు చెందిన రమేష్‌ ఇద్దరూ ప్రేమించుకుని ఏడాదిన్నర క్రితం వివాహం చేసుకున్నారు. వారికి ఏడు నెలల కూతురు ఉంది. కాగా కొంత కాలంగా రమేష్‌ తండ్రి వెంకటేష్‌ (50) కోడలు ప్రియాంకను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ విషయాన్ని గతంలో పలుపర్యాయాలు ప్రియాంక తన కుటుంబసభ్యుల దృష్టికి తీసుకెల్లింది. అప్పట్లో పెద్దలు మాట్లాడి తండ్రిలాంటివాడని నచ్చచెప్పడంతో తిరిగి అత్తవారింటికి వెళ్లింది. 

అత్తాపూర్‌లో ఐస్‌క్రీం షాప్‌లో డెలివరీబాయ్‌గా పనిచేస్తున్న రమేష్‌ బుధవారం సాయంత్రం తన భార్య ప్రియాంక, కూతురును పూల్‌బాగ్‌లోని వారి తల్లిదండ్రుల ఇటివద్ద వదిలి వెళ్లాడు. పూల్‌బాగ్‌ లోని జేఎన్‌ఎన్‌ యూఆర్‌ఎం ప్రభుత్వ క్వార్టర్స్‌ రెండో అంతస్తులో ఆమె తల్లిదండ్రులు ఉండగా, మూడో అంతస్తులో ఆమె అన్న ఉంటున్నారు. గురువారం అందరూ పనుల్లోకి వెళ్లిన తర్వాత  భర్తతో ఫోన్‌లో మాట్లాడుతూ మధ్యాహ్నం 12 గంటల సమయంలో మూడో అంతస్తులోని అన్న ఇంటికి వెల్లింది. తర్వాత కొద్దిసేపటికి ఆమె కుటుంబసభ్యులు ఇంటికి వచ్చి చూడగా తలుపు గడియపెట్టి ఉంది. కిటికీలోనుండి చూడగా ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ ఉరివేసుకుని ఉండడం గమనించారు. తలుపులు బలంగా కొట్టి లోనికి వెల్లి ఆమెను దింపగా అప్పటికే మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు. ప్రియాంక తండ్రి నర్సింగరావు ఫిర్యాదు మేరకు సైఫాబాద్‌ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు