కూతురు బాధ చూడలేక..

6 Feb, 2018 11:45 IST|Sakshi
హత్యకు గురైన రామకృష్ణ

అల్లుడిని అంతమొందించిన మామ

మాయలూరులో మాజీ జవాన్‌ దారుణహత్య

ఉయ్యాలవాడ: మద్యానికి బానిసై నిత్యం కుమార్తెను వేధిస్తున్న అల్లుడిని మామ హత్య చేసిన సంఘటన సోమవారం ఉయ్యాలవాడ మండలంలో చోటు చేసుకుంది. ఉయ్యాలవాడకు చెందిన కమతం చిన్నయ్య కుమారుడు రామకృష్ణ(45) 20 ఏళ్ల క్రితం ఆర్మీలో సైనికుడిగా చేరి దాదాపు 15 సంవత్సరాలు పలు చోట్ల విధులు నిర్వర్తించాడు. ఎనిదేళ్ల క్రితం ఉద్యోగ విరమణ పొంది స్వగ్రామం చేసుకున్నాడు. ఉద్యోగం చేస్తున్న సమయంలో వైఎస్‌ఆర్‌ జిల్లా దేవగుడి గ్రామానికి చెందిన బాలసుబ్బయ్య, అచ్చమ్మ దంపతుల కుమార్తె సావిత్రమ్మను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతానం. ఈమె మండలంలోని పుచ్చకాయలపల్లెలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో స్వీపర్‌గా పనిచేస్తోంది. 

భర్త వేధింపులు అధికం కావడంతో ఆమె రెండు నెలల క్రితం నుంచి పాఠశాలలో విధులు నిర్వర్తిస్తూ అక్కడే జీవనం కొనసాగిస్తోంది. సోమవారం రామకృష్ణ  భార్యను ఇంటికి తీసుకెళ్లేందుకు పుచ్చకాయలపల్లెకు చేరుకున్నాడు. కాగా తమ నాన్న చెబితే వెంట వస్తానని భార్య చెప్పడంతో ఇద్దరు కలిసి ఆటోలో మాయలూరు భారత్‌ పెట్రోల్‌ బంకులో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న బాలసుబ్బయ్య వద్దకు వెళ్లారు. తన కుమార్తెను పంపనని చెప్పడంతో మామ, అల్లుడి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో బాలసుబ్బయ్య పక్కనే ఉన్న ఇనుపరాడ్‌ తీసుకుని అల్లుడి తలపై గట్టిగా కొట్టడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కోవెలకుంట్ల సీఐ శ్రీనివాసరెడ్డి, స్థానిక ఎస్‌ఐ నిరంజన్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

మరిన్ని వార్తలు