కూతుళ్లపై తండ్రి పైశాచిక చర్యలు:సహకరించిన తల్లి

20 Aug, 2019 14:02 IST|Sakshi

లక్నో :  సమాజంలో నైతిక విలువలు  రోజురోజుకు దిగజారుతున్నాయనడానికి మరో ఉదాహరణ వెలుగులోకి వచ్చింది. తన మన తేడా లేకుండా కొందరు మానవ మృగాలు పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. ఓ తండ్రి  కన్న కూతురుపైనే అత్యాచారానికి ఒడిగట్టాడు. ఇది కేవలం ఒక్కరోజు, రెండు రోజులు జరిగిన ఘటన కాదు. ఏకంగా 15 సంవత్సరాలపాటు కొనసాగింది. దీనికితోడు బాధితురాలి తల్లి కూడా భర్తకే మద్దతు తెలపడం  మరింత ఘోరం. ఈ అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో చోటుచేసుకుంది. 

వివరాలు.. లక్నోకు చెందిన ఓ యువతి(21) తనపై తండ్రి 15 సంవత్సరాల నుంచి అత్యాచారానికి పాల్పడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన చెల్లెలు(6) పై కూడా తండ్రి ప్రస్తుతం లైంగిక వేధింపులకు పాల్పడటంతో బాధితురాలు ఓ ఎన్జీఓ సహాయంతో పోలీసులను ఆశ్రయించింది. ఈ క్రమంలో తన సోదరిని ఇంటి నుంచి బయటకు తీసుకు వచ్చింది. ఇంట్లో జరుగుతుందంతా తల్లికి తెలిసినప్పటికీ నోరు మెదపకపోవడంతో పాటు తండ్రికి సహకరిస్తూ తనకు గర్భనిరోధక మాత్రలు ఇచ్చేదని పోలీసుల ఎదుట వాపోయింది. దీంతో లైంగిక నేరాల నుంచి చిన్నారులను రక్షించే చట్టం(పోక్సో)2012 కింద నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, ప్రస్తుతం బాధితురాలి తల్లిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

మరిన్ని వార్తలు