తినడానికి అడిగాడని కొడుకును కెనాల్‌లో విసిరేశాడు

28 May, 2018 13:05 IST|Sakshi
కొడుకు అయాన్‌,తండ్రి సంజయ్‌ అల్వి

న్యూఢిల్లీ : తాగిన మైకంలో ఉన్న ఓ తండ్రి కొడుకు తినడానికి మోమో(టిబెటన్‌ ఆహార పదార్థము)లు అడిగి ఇబ్బంది పెట్టాడని కెనాల్‌లో విసిరేశాడు. ఈ సంఘటన శనివారం అర్థరాత్రి ఆగ్రాకు సమీపంలో చోటుచేసుకుంది. బాలుడ్ని కెనాల్‌లో విసిరేయటం గమనించిన కొంతమంది పోలీసులకు సమాచారమివ్వటంతో అధికారులు బాలుడ్ని రక్షించడానికి రంగంలోకి దిగారు. ఆదివారం సాయంత్రం పోలీసులు కెనాల్‌లో తేలియాడుతున్న బాలుడి మృతదేహాన్ని కనుగొన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

భంగార్‌ మొహల్లాకు చెందిన సంజయ్‌ అల్వి(31)కి ఆస్మ అనే మహిళతో 2004లో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. కొన్ని కారణాల వల్ల 2014 నుంచి వీరిద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. సంజయ్‌ 6 ఏళ్ల కుమారుడు అయాన్‌తో పాటు నాన్నమ్మతో కలిసి భంగార్‌ మొహల్లాలోనే నివాసముంటున్నాడు. ఇ-రిక్షా నడుపుతూ జీవనం సాగిస్తున్న సంజయ్‌ తాగుడుకు బానిసయ్యాడు. శనివారం అర్థరాత్రి కొడుకుతో కలిసి ఇ-రిక్షాలో బయటకు వెళ్లాగా కొద్ది సేపటి తర్వాత బాలుడు మోమోలు కావాలని సంజయ్‌ని అడిగాడు.

తాగిన మైకంలో ఉన్న అతడు ఇదేమి పట్టించుకోకపోవడంతో కొడుకు ఏడవటం మొదలుపెట్టాడు. దీంతో ఆగ్రహించిన సంజయ్‌ కుమారుడిని ఎత్తుకెళ్లి పక్కనే ఉన్న ఆగ్రా కెనాల్‌లో విసిరేశాడు. ఇది గమనించిన కొంత మంది పోలీసులకు సమాచారమివ్వటంతో పోలీసులు సంజయ్‌ని అరెస్ట్‌ చేశారు. హత్యకేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కొడుకు మోమోలు అడిగినందుకే నీటిలో విసిరేశాడా? లేక వేరే కారణం ఏదైనా ఉందా? అన్న కోణంలో విచారణ చేపట్టారు. 

మరిన్ని వార్తలు