నాగవైష్ణవి హత్య కేసులో వెలువడిన తీర్పు

14 Jun, 2018 14:12 IST|Sakshi

నిందితులకు జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసిన మహిళా సెషన్స్‌ కోర్టు

సాక్షి, విజయవాడ : ఎనిమిదేళ్ల క్రితం 2010లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన నాగవైష్ణవి హత్య కేసులో గురువారం తీర్పు వెలువడింది. ఎనిమిదేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం విజయవాడ మహిళా సెషన్స్‌ జడ్జి ఈ కేసులో తుది తీర్పు ప్రకటించారు. గురువారం నిందితులకు శిక్ష ఖరారు చేసే ముందు ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి, ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు శిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చారు. 79 మందిని విచారించిన న్యాయస్థానం, వెంటకరావు గౌడ్‌ను ప్రధాన దోషిగా నిర్ధారిస్తూ తుది తీర్పును వెలువరించింది. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడే వారికి కఠిన చర్యలు తప్పవు అనిపించేలా ఈ తీర్పు ఉందని ప్రజలు భావిస్తున్నారు. 

వైష్ణవి హత్య నేపథ్యం : విజయవాడకు చెందిన బీసీ నాయకుడు పలగాని ప్రభాకర్‌ కుమార్తె నాగవైష్ణవి 2010 జనవరి 30న కారులో పాఠశాలకు వెళుతుండగా దుండగులు అడ్డగించి డ్రైవరును హతమార్చి వైష్ణవిని కిడ్నాప్ చేశారు. రెండు రోజుల పాటు తీవ్ర గాలింపుల అనంతరం, గుంటూరు శివార్లలోని ఆటోనగర్‌లోని ప్లాట్ నెంబరు 445లో చిన్నారి శవం లభ్యమైంది. అభం శుభం తెలియని చిన్నారిని వేధింపులకు గురిచేసి, అనంతరం బాయిలర్‌లో వేసి బాలికను కాల్చి చంపినట్లులో పోలీసులు గుర్తించారు.

ప్రభాకర్‌పై కోపంతో ఆయన మొదటి భార్య వెంకటేశ్వర్వమ్మ తమ్ముడు పంది వెంకట్రావు ఈ హత్యకు కట్ర పన్నిట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా మెర్ల శ్రీనివాసరావు, ఏ2గా వెంపరాల జగదీష్, ఏ3గా పంది వెంకట్రావు అలియాస్‌ కృష్ణ ఏడేళ్లుగా జైలులో రిమాండ్‌లోనే ఉన్నారు. నిందితులకు బెయిల్‌ మంజూరు చేయకుండానే కేసు విచారణ పూర్తి చేశారు. వారిపై ఐపీసీ 302, 367, 420, 201, 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చార్జిషీట్‌ దాఖలు చేశారు.

వైష్ణవి హత్య వార్త తెలియడంతో బాలిక కుటుంబం షాక్‌కు గురైంది. తన గారాలపట్టి హత్యకు గురైందన్న విషయం తెలసుకొని ప్రభాకర్‌ పుత్రికా శోకంతో కన్నుమూశారు. దాంతో ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆస్తి కోసం సొంతవారే చిన్నారిని దారుణంగా హతమార్చడంపై ప్రజాసంఘాలు నిరసనకు దిగాయి. నిందితలను కఠింగా శిక్షించాలంటూ ఆందోళనలు చేశారు.

మరిన్ని వార్తలు