అజహరుద్దీన్‌పై ఎఫ్‌ఐఆర్‌.. 

23 Jan, 2020 11:39 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

సాక్షి, హైదరాబాద్‌: భారత మాజీ కెప్టెన్‌, హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ) అధ్యక్షుడు మహ్మద్‌ అజహరుద్దీన్‌పై ఔరంగాబాద్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అజహరుద్దీన్‌తో పాటు మరో ఇద్దరిపై కూడా కేసు నమోదయినట్లు తెలుస్తోంది. అజహరుద్దీన్‌తో పాటు మరో ఇద్దరు కలిసి తనను రూ. 20 లక్షల మేర మోసం చేశారని ఔరంగాబాద్‌కు చెందిన ఓ ట్రావెల్‌ ఏజెంట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

ఇక తనపై వస్తున్న ఆరోపణలు, ఎఫ్‌ఐఆర్‌ నమోదు కావడంపై అజహరుద్దీన్‌ స్పందించారు. ఔరంగాబాద్‌ పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ అర్థం లేనిదని ఖండించారు. తప్పుడు ఆరోపణలపై కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. అంతేకాకుండా దీనిపై తాను న్యాయ పోరాటం చేస్తానని పేర్కొన్నారు. అదేవిధంగా రూ. 100 కోట్లకు పరువు నష్టం దావా వేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. తన లీగల్‌ టీమ్‌తో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని అజహరుద్దీన్‌ పేర్కొన్నారు.  
 

మరిన్ని వార్తలు