మడకశిరలో భారీ అగ్ని ప్రమాదం

25 Jan, 2019 12:53 IST|Sakshi
అగ్నికి ఆహుతవుతున్న ఉడ్‌ వర్క్‌ షాపు

ఉడ్‌ వర్క్‌ షాపు, చికెన్‌ సెంటర్‌ దగ్ధం

రూ.18 లక్షల ఆస్తి నష్టం

అనంతపురం,మడకశిర:  పట్టణంలోని మధుగిరి సర్కిల్‌ సమీపంలో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనలో చికెన్‌ సెంటర్, ఉడ్‌వర్క్‌ షాపులు దగ్ధమయ్యాయి. బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. పట్టణానికి చెందిన సర్పరాజ్‌ కొన్నేళ్ల నుంచి మధుగిరి సర్కిల్‌ సమీపంలో చికెన్‌సెంటర్‌ ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. చికెన్‌సెంటర్‌ పక్కనే పట్టణానికి చెందిన గంగరాజు ఉడ్‌వర్క్‌ షాపు నిర్వహించేవాడు. అర్ధరాత్రి సమయంలో ఉన్నఫళంగా మంటలు వ్యాపించి షాపులు రెండు దగ్ధమయ్యాయి.

దీంతో చికెన్‌ సెంటర్‌లోని కోళ్లు, కోడిగుడ్లు, ఇతర వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. ఉడ్‌వర్క్‌ షాపులో కూడా విలువైన వస్తువులు, కట్టెలు కాలి బూడిదయ్యాయి. ఘటనలో చికెన్‌ సెంటర్‌ నిర్వాహకుడికి రూ.3 లక్షలు, ఉడ్‌వర్క్‌షాపు నిర్వాహకుడికి రూ.15 లక్షలు నష్టం వాటిల్లింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా ఈప్రమాదానికి కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అయితే ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? లేదా క్షక్షగట్టి కావాలనే ఎవరైనా షాపులకు నిప్పు పెట్టారా? అనే విషయం సస్పెన్స్‌గా మారింది. 

మరిన్ని వార్తలు