లక్నో : యూపీలోని ఫతేపూర్లో భార్యను కిరాతకంగా హత్య చేసి పారిపోతున్న వ్యక్తిని చితకబాదిన ఘటనలో ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. భార్యను గొడ్డలితో నరికిచంపి అత్తింటి వారిపై పాశవిక దాడికి పాల్పడి పారిపోతున్న నిందితుడు నసీర్ ఖురేషిని చావబాదిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిందితుడిని చావబాదిన కేసులో ఒసామా, అబ్దుల్ ఖురేష్, సల్మాన్, రఫీక్, షానవాజ్లను అరెస్ట్ చేశామని, వీరు ఖురేషి భార్య అఫ్సారి (35) బంధువలని పోలీసులు తెలిపారు. చత్తీస్గఢ్కు చెందిన ఖురేషి ఫతేపూర్లోని అత్తారింటికి వచ్చిన సందర్భంగా ఈ ఘటన జరిగింది. ఖురేషి తన భార్య అఫ్సారిపై గొడ్డలితో దాడిచేసిన అనంతరం అత్త, మరదలిపైనా దాడికి పాల్పడ్డాడు. దాడి అనంతరం అక్కడినుంచి పారిపోతున్న ఖురేషిని అడ్డగించిన స్ధానికులు అతడిని చితకబాదడంతో అక్కడికక్కడే మరణించాడు. ఖురేషి సోదరుడు శుక్రవారం పోలీసులుకు ఫిర్యాదు చేయడంతో పాటు ఘటనకు సంబంధించిన వీడియో అందించారని పోలీసులు తెలిపారు.