పారిశ్రామికవేత్తపై ఐరోపా యువతి ఫిర్యాదు

18 Oct, 2019 07:43 IST|Sakshi
ఐరోపా విద్యార్థిని..

తమిళనాడు ,టీ.నగర్‌: చెన్నైకు చెందిన పారిశ్రామికవేత్త మోసగించినట్లు ఐరోపా యువతి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. చెన్నై అమింజికరై రైల్వే కాలనీ మూడో వీధికి చెందిన రూమోస్‌ అహ్మద్‌ (28) పారిశ్రామికవేత్త. పెద్ద స్థాయిలో రొయ్యల వ్యాపారం చేస్తున్నాడు. ఇతను వ్యాపారరీత్యా కొన్ని నెలల క్రితం దుబాయ్‌ వెళ్లాడు. ఆ సమయంలో ఐరోపాలోని లిథువేనియా ప్రాంతానికి చెందిన యువతి (22) దుబాయ్‌లో ఉన్నత విద్య చదువుతోంది. రూమోస్‌ అహ్మద్‌ ఆమెను కలిసి మాట్లాడడంతో స్నేహం ఏర్పడింది.

ఇది కాలక్రమంలో ఇరువురి మధ్య ప్రేమకు దారితీసింది. ఇరువురూ పలుసార్లు ఏకాంతంగా కలుసుకున్నారు. దీంతో ఆమె ఐదు నెలల గర్భిణి. తర్వాత యువతిని రూమోస్‌ అహ్మద్‌ చెన్నై తీసుకువచ్చి ఎగ్మూరులోని ఒక హోటల్‌లో ఉంచాడు. ఇలాఉండగా రూమోస్‌ అహ్మద్‌ తండ్రి ప్రోద్బలంతో జూన్‌ 21న థౌజండ్‌ లైట్స్‌లోని ఆస్పత్రిలో యువతికి అబార్షన్‌ చేయించినట్లు సమాచారం. అయితే మళ్లీ ఆ యువతి రెండు నెలల గర్భిణి అని తెలిసింది. దీంతో రూమోస్‌ అహ్మద్‌ను వివాహం చేసుకోవాలని బలవంతం చేసింది. అతను ఆమెను వివాహం చేసుకోకుండా అదృశ్యమయ్యాడు. దిగ్భ్రాంతి చెందిన బాధిత యువతి థౌజండ్‌లైట్స్‌లోని మహిళా పోలీసు స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేసింది. పోలీసులు రూమోస్‌ అహ్మద్‌ కోసం గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు