మాజీ ఎమ్మెల్యే దారుణ హత్య

8 Jan, 2019 09:21 IST|Sakshi

గాంధీనగర్‌ : గుజరాత్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే జయంతీలాల్‌ భానుషలీ రైలులో దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు ఆయనను తుపాకీతో కాల్చి చంపారు.  భుజ్‌ నుంచి అహ్మదాబాద్‌ వెళ్లే సజయీ నగరీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న సమయంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. గుజరాత్‌ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడిగా, అబుదాస నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేసిన జయంతీలాల్‌ భానుషలీపై అత్యాచార ఆరోపణలు ఉన్నాయి. గతంలో జయంతీలాల్‌ తనపై అకృత్యానికి పాల్పడ్డారంటూ సూరత్‌కు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అయితే డబ్బు కోసమే తన భార్య ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసిందంటూ ఆమె భర్త పేర్కొనడంతో ఈ కేసుపై అనుమానాలు నెలకొన్నాయి.

కాగా వ్యక్తిగత పగతోనే దుండగులు జయంతీలాల్‌ను హత్య చేసి ఉంటారని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో ఓ తుపాకీ లభించిందని, ఈ నేపథ్యంలో జయంతీలాల్‌ తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు