రెడ్‌ ఎఫ్‌ఎం మాజీ ఆర్జే హత్య

27 Mar, 2018 11:18 IST|Sakshi
రాజేశ్‌ (ఫైల్‌ ఫొటో)

త్రివేండ్రం : గత రెండు రోజులుగా జర్నలిస్టుల వరుస హత్యలతో కలకలం రేగుతున్న నేపథ్యంలో... కేరళకు చెందిన ఆర్జే, మిమిక్రీ కళాకారుడు రాజేశ్‌(36)ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. మదావూర్‌లోని తన స్టూడియో నుంచి స్నేహితునితో కలిసి బయల్దేరిన రాజేశ్‌ వాహనాన్ని రెడ్‌ కలర్‌ స్విప్ట్‌ కారులో కొందరు వ్యక్తులు వెంబండించారు. తమ వద్దనున్న పదునైన ఆయుధాలతో రాజేశ్‌, అతని స్నేహితునిపై దాడి చేశారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రాజేశ్‌, అతన్ని స్నేహితున్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా తీవ్రంగా గాయపడిన రాజేశ్‌ మరణించాడు. అతని స్నేహితుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. హంతకులను పట్టుకునేందుకు విచారణ ప్రారంభించామని పోలీసులు తెలిపారు.

కాగా రాజేశ్‌ గతంలో చాలా ఏళ్ల పాటు ప్రముఖ రేడియో చానెల్‌ రెడ్‌ ఎఫ్‌ఎంలో ఆర్జేగా పని చేశాడు. తర్వాత దోహాలోని వాయిస్‌ ఆఫ్‌ కేరళ ఎఫ్‌ఎం స్టేషన్‌లో పని చేశాడు. ప్రస్తుతం మిమిక్రి ట్రూప్‌ను ఏర్పాటు చేసుకుని ప్రదర్శనలు ఇస్తున్న నేపథ్యంలో హత్యకు గురయ్యాడు.

మరిన్ని వార్తలు