వీఆర్‌ఏల పేర్లపై నాలుగు ఎకరాల భూమి పట్టా

16 May, 2018 10:04 IST|Sakshi
పంపిణీ కేంద్రం వద్ద గుమికూడిన జనాలు 

కొత్త పాస్‌పుస్తకాలు, చెక్కులు గ్రామానికి రాక

గుర్తించిన గ్రామస్తులు.. అధికారుల నిలదీత   

 చెక్కుల పంపిణీ కార్యక్రమం గందరగోళం

ఆర్డీఓ రాకతో సద్దుమణిగిన వివాదం

చిలప్‌చెడ్‌(నర్సాపూర్‌)మెదక్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతు బంధు పథకంలో కొత్త రకం అక్రమాలు వెలుగచూశాయి. మెదక్‌ జిల్లా చిలప్‌చెడ్‌ మండలంలోని గౌతాపూర్‌ గ్రామంలో వీఆర్‌ఏలు చేతివాటం ప్రదర్శించారు. భూ రికార్డుల ప్రక్షాళనలో పాల్గొన్న వీఆర్‌ఏలు రాజు, శంకరయ్య, కిరణ్‌ వారి పేర్లపై సుమారు నాలుగు ఎకరాల భూమిని పట్టాచేసుకున్నారు.

దీంతో వారిపేర్లపై నూతనంగా పాస్‌పుస్తకాలు, చెక్కులు వచ్చాయి. దీంతో వారికి ఇక్కడ లేని భూమిపై ఏవిధంగా పాస్‌ బుక్కులు, చెక్కులు వస్తాయని గ్రామస్తులు సోమవారం జరిగిన చెక్కుల పంపిణీలో అధికారులను నిలదీశారు. గ్రామస్తులు మట్లాడుతూ  ఈ విషయం తహసీల్దార్‌కు తెలియకుండానే జరిగందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసిన వీఅర్‌ఏలపై  తహసీల్దార్‌ సాదత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎలా జరిగిందని ఆయన ప్రశ్నించాగా వారు సమాధానం చెప్పకపోవడంతో వీఆర్‌ఏ రాజుపై చేయిచేసుకున్నాడు. అదే విధంగా మిగతా వీఅర్‌ఏలపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో  విషయం తెలుసుకున్న ఆర్డీఓ వెంకటేశ్వర్లు  గౌతాపూర్‌ గ్రామానికి వచ్చి అధికారులను ప్రశ్నించారు. ఆయన మాట్లాడుతూ అధికారులు నిర్లక్ష్యం వల్లే అక్రమాలు జరిగాయని, ఇంత జరుగుతున్న తహసీల్దార్‌ ఏం చేస్తున్నారని ఆర్డీఓను ప్రశ్నించారు.

తప్పు చేసినవారిపై చర్యలు తీసుకుంటామని ఆయన గ్రామస్తులకు వివరించారు.  అలాగే  ప్రజలు తీసుకున్న  చెక్కులు, పాస్‌బుక్కుల్లో చాలా తప్పులున్నాయని వారు గుర్తించారు. దీంతో  ఎక్కడా లేని విధంగా ఈ గ్రామంలో 315 వరకు ఫిర్యాదులు అందాయి. దీంతో రాత్రి 8 గంటల వరకు ఆర్డీఓ ఫిర్యాదులు స్వీకరించారు.

అనంతరం ఆ ఫిర్యాదులను పరిశీలించి ఇన్ని తప్పులుంటాయా? అన్ని వారిపై మండిపడ్డారు. త్వరలోనే గ్రామంలో జరిగిన అన్ని తప్పులుసరిచేస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు