సాక్షి, భోపాల్: మధ్యప్రదేశ్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తమ కూతురు ఓ అబ్బాయితో మాట్లాడటమే పాపంగా భావించిన తల్లిదండ్రులు ఆమెను చితకబాదారు. ఈ దారుణ ఘటన అలిరాజ్పూర్ ప్రాంతంలో ఉన్న సౌద్వలో ఓ మైనర్ బాలిక తెలిసిన అబ్బాయితో ఫోన్లో మాట్లాడింది. ఆమె తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసింది. దీంతో వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కన్న కూతరు అనే కనికరం లేకుండా ఆ అమ్మాయిని విపరీతంగా కొట్టారు.
ఇంకెప్పుడూ ఆ అబ్బాయితో మాట్లాడను వదిలిపెట్టండి అంటూ ఆ అమ్మాయి వేడుకున్నా వారు వినిపించుకోకుండా దుర్మార్గంగా ప్రవర్తించారు. అదీ చాలదన్నట్లు అందరూ చూస్తుండగానే నడివీధిలోకి లాక్కొచ్చి ఆమెకు గుండు కొట్టించారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సోషల్ మీడియా ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.