అయ్యో.. రామ

15 Apr, 2019 22:24 IST|Sakshi
దౌలాపూర్‌ వద్ద ఆటోను ఢీకొన్న లారీ, (ఇన్‌సెట్‌) రోడ్డుపై చెల్లాచెదురుగా పడిఉన్న మృతదేహాలు 

రాములోరి జాతరకు వెళ్లి వస్తూ మృత్యుఒడికి

ఆటోను లారీ ఢీకొట్టడంతో నలుగురి మృతి 

మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

యాలాల మండలం దౌలాపూర్‌ సమీపంలో ఘటన

సాక్షి,  యాలాల / వికారాబాద్‌ : శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొని తిరిగి వెళ్తున్న భక్తుల ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన యాలాల మండలం దౌలాపూర్‌ సబ్‌స్టేషన్‌ సమీ పంలో సోమవారం రాత్రి జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. జుంటుపల్లి ప్రాథమిక పాఠశాల ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం సిరిమానగారి అనంతయ్య (55), భార్య లక్ష్మి (45), కుమార్తె శివకళ, తాండూరుకు చెందిన తుల్జమ్మ (38), భారతమ్మ (45) వేర్వేరుగా సోమవారం యాలాల మం డలం జుంటుపల్లిలో జరిగిన రామస్వామి జాతరకు వచ్చారు. అనంతరం వారంతా తాండూరు వెళ్లేందుకు అక్కంపల్లి గ్రామానికి చెందిన అశోక్‌ ఆటోలో ఎక్కారు.

ఐదుగురు ప్రయాణికులతో తాండూరుకు వెళ్తున్న ఆటోను దౌలాపూర్‌ సబ్‌స్టేషన్‌ సమీపంలోకి రాగానే తాండూరు నుంచి కొడంగల్‌ వైపు వెళుతున్న ఓ లారీ ఢీకొట్టింది. అయితే రోడ్డు మధ్యలో ఏర్పడిన గుంతను తప్పించబోయి డ్రైవర్‌ ఆటోను ఢీకొట్టాడు. ఈ ఘటనలో అనంతయ్య, లక్ష్మి, తుల్జమ్మ, భారతమ్మæ ఘటనా స్థలంలోనే మృత్యువాతపడ్డారు. ఆటో డ్రైవర్‌ అశోక్, శివకళ తీవ్ర గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న రూరల్‌ సీఐ ఉపేందర్, యాలాల ఎస్‌ఐ విఠల్‌రెడ్డి ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను, క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు.

వాహనంలో చిక్కుకున్న బాలిక శివకళ... ఇన్‌సెట్లో అనంతయ్య (ఫైల్‌) ,తుల్జమ్మ మృతదేహం

మరిన్ని వార్తలు