ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నం

8 May, 2019 13:08 IST|Sakshi

సాక్షి, అనంతపురం : జిల్లాలోని గోరంట్లలో తీవ్ర విషాదం నెలకొంది. ఆస్తిపంపకాల విషయంలో గొడవపడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. నిన్న రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా ఈ రోజు వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తండ్రి ఆస్తి పంపకంలో గొడవపడిన గోరంట్లకు చెందిన రామకృష్ణమ్మ, ఆమె కుమారుడు వేణుగోపాల్, సోదరులు మోహన్, సోమశేఖర్ మంగళవారం రాత్రి ఊరి చివర గల స్మశానం వద్దకు చేరుకున్నారు. అనంతరం అక్కడ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈరోజు ఉదయం అటువైపుగా వెళ్లిన గ్రామస్తులు వారిని చూసి పోలీసులకు సమాచారం అందించాడు.సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని వీరిని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

వీరిలో మోహన్, సోమశేఖర్ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.  రామకృష్ణమ్మ, వేణుగోపాల్ ల పరిస్థితి విషమంగా ఉందనీ, మరో 24 గంటలు గడిస్తే కానీ చెప్పలేమని స్పష్టం చేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు