విహారంలో ఘోర విషాదం

7 Nov, 2017 06:48 IST|Sakshi
మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు

చెరువులో మునిగి నలుగురు బాలలు, ఒక వ్యక్తి మృతి

మృతులు హైదరాబాద్‌వాసులు

కొప్పళ జిల్లా గంగావతి తాలూకాలో ఘటన

గంగావతి: సరదాగా బంధువుల ఇంటికి వచ్చి ప్రమాదవశాత్తు నీట మునిగి నలుగురు బాలలు, ఒకవ్యక్తి విగతజీవులయ్యారు. మృతులందరూ హైదరాబాద్‌కు చెందినవారు. సోమవారం కొప్పళజిల్లా గంగావతి తాలూకా హేమగుడ్డ శ్రీ దుర్గా పరమేశ్వర దేవాలయం వద్దనున్న చెరువులో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులను ప్రవల్లిక (16), పవిత్ర (15), పావని (14), రాఘవేంద్ర (32), ఆశిష్‌ (15)లుగా గుర్తించారు.

గౌరి పౌర్ణమికి వచ్చి : వివరాలు... ప్రతి ఏడాది గౌరి పౌర్ణమి సందర్భంగా గంగావతి నగరంలో వారి సమీప బంధువులైన మాజీ కౌన్సిలర్‌ సీ.మోహన్‌రావు నివాసానికి వస్తుంటారు. మృతులందరూ మోహన్‌రావు సోదరుడు, సోదరిల పిల్లలు. ఏటా కార్తీకంలో కుటుంబ సభ్యులతో కలసి హేమగుడ్డ దుర్గమ్మ దేవస్థానానికి వెళ్లి పూజలు చేయడం ఆనవాయితీ. ఈ క్రమంలో సోమవారం బంధువులు ఇంట్లో వంటలు చేసేపనిలో నిమగ్నమై ఉండగా, వారికి చెప్పకుండా చెరువుకు స్నానా నికని వెళ్లారు. నీటిలో ఆడుకుంటుండగా లోతైన ప్రాంతంలో మునిగిపోయారు. మధ్యాహ్నమైనా పిల్లలు ఇంటికి రాకపోవడంతో బంధువులు చెరువు వద్దకు వెళ్లి వెతగ్గా  మృతదేహాలు కనిపించాయి. బాధితుల బంధువుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం అనంతరం హైదరాబాద్‌కు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

తీరని విషాదం
కొప్పళ జిల్లా గంగావతి తాలూకాలో చెరువులో స్నానానికి వెళ్లి నలుగురు బాలలతో పాటు ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్‌ నుంచి కార్తీక ఉత్సవాల కోసం బంధువుల ఇంటికి వచ్చి జలసమాధి అయ్యారు. ఒడిలో మృతదేహాలతో విలపిస్తున్న మహిళ.

మరిన్ని వార్తలు