ఏసీబీకి చిక్కిన నలుగురు అధికారులు

17 Dec, 2019 06:01 IST|Sakshi
సీసీఎస్‌ సీఐ రామయ్యనాయుడు (అద్దాలు పెట్టుకున్న వ్యక్తి)ని విచారిస్తున్న ఏసీబీ డీఎస్పీ నాగభూషణం

ఒక సీఐ, ఐసీడీఎస్‌ సీడీపీవోతో సహా మరో ఇద్దరు అరెస్టు

సాక్షి, అమరావతి/కర్నూలు/కొత్తవలస: రాష్ట్రంలో కర్నూలు, విజయనగరం జిల్లాల్లో సోమవారం లంచం తీసుకుంటున్న నలుగురిని అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఏసీబీ డీజీ కుమార్‌ విశ్వజిత్‌ మీడియాకు విడుదల చేశారు. కర్నూలులోని భూపాల్‌ కాంప్లెక్స్‌లో ఉన్న  చంద్రకాంత్‌ చిట్‌ఫండ్స్‌ నిర్వాహకులు గోపాల్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డిపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండో పట్టణ పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు. దీని దర్యాప్తును సీసీఎస్‌ సీఐ రామయ్య నాయుడుకు అప్పగించారు. ఆదినారాయణరెడ్డిని అరెస్టు చేయకుండా ఉండేందుకు, తనపై రౌడీషీటు తెరవకుండా ఉండేందుకు గతంలో రూ.లక్ష తీసుకున్న సీఐ మళ్లీ లంచం డిమాండ్‌ చేస్తున్నాడని గోపాల్‌రెడ్డి ఏసీబీకి ఫిర్యాదు చేశాడు.

ఈ క్రమంలోనే స్థానిక వెంకటరమణ కాలనీలోని హరిత హోటల్‌లో న్యాయవాది చంద్రశేఖర్‌రెడ్డి సీఐ తరఫున లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ నాగభూషణం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీంతో వీరిపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. అలాగే అంగన్‌వాడీ కేంద్రాలకు కూరగాయలు, కిరాణా సరుకులు అందించే ఒప్పందాన్ని కొనసాగించేందుకు ఆదారి సురేష్‌కుమార్, ఎస్‌.రమణబాబు నుంచి  విజయనగరం జిల్లా, కొత్తవలస మండలం వియ్యంపేట ఐసీడీఎస్‌ సీడీపీవో పోతల మణెమ్మ లంచం డిమాండ్‌ చేసింది. దీంతో వారు ఏసీబీని ఆశ్రయించారు. సీడీపీవో మణెమ్మ ఆదేశాల మేరకు సీనియర్‌ అసిస్టెంట్‌ వేణుగోపాల్‌ రూ.85 వేలు లంచం తీసుకుని టేబుల్‌ సొరుగులో పెడుతుండగా ఏసీబీ డీఎస్పీ నాగేశ్వరరావు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని, మంగళవారం విశాఖపట్నం ఏసీబీ కోర్టుకు తరలిస్తామని ఆయన చెప్పారు.


వియ్యంపేట ఐసీడీఎస్‌ సీడీపీవో మణెమ్మ


వేణుగోపాల్‌

మరిన్ని వార్తలు