వైఎస్‌ జగన్‌ పీఏ నెంబర్‌ స్పూఫింగ్‌ చేసినందుకు అరెస్ట్‌

28 Jul, 2019 06:56 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో : ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) కె.నాగేశ్వర్‌రెడ్డి (కేఎన్నార్‌) వినియోగిస్తున్న సెల్‌ఫోన్‌ నంబర్‌ను స్పూఫింగ్‌ చేసిన నలుగురు నిందితులను హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు పీటీ వారెంట్‌పై శనివారం అరెస్ట్‌ చేశారు. ఈ పరిజ్ఞానం ఉపయోగించి అనేక మందికి కాల్స్‌ చేస్తున్న ఆగంతకులు వైఎస్‌ జగన్‌ లాగా మాట్లాడారు. ఆపై కొన్ని వాట్సాప్‌ నంబర్ల ద్వారా చాటింగ్‌ చేశారు. ఈ సందర్భంలో బీజేపీ ఎంపీ పూనమ్‌ మహాజన్‌ పేరు, డిస్‌ప్లే పిక్చర్‌ (డీపీ) వాడుకున్నారు.

ఈ నేపథ్యంలోనే చేస్తున్న వాయిస్‌ ఓవర్‌ ఇంటర్‌నెట్‌ ప్రొటోకాల్‌ (వీఓఐపీ) కాల్స్‌ చేసిన దుండుగులు కొందరిని డబ్బు డిమాండ్‌ చేయగా, మరికొందరిని దూషించారు. దాదాపు పక్షం రోజుల పాటు సాగిన ఈ వ్యవహారం సీరియస్‌గా తీసుకున్న పార్టీ కేంద్ర కార్యాలయం 2018 డిసెంబర్‌లో హైదరాబాద్‌ సిటీ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌కు ఫిర్యాదు చేసింది. ఆయన కేసును దర్యాప్తు చేయాల్సిందిగా సైబర్‌ క్రైమ్‌ పోలీసుల్ని ఆదేశించారు.

కేఎన్నార్‌ వినియోగించిన ఆ సెల్‌ఫోన్‌ నంబర్‌ హర్షవర్ధన్‌ రెడ్డి పేరుతో ఉంది. వైఎస్‌ జగన్‌ పార్టీ శ్రేణులు, నేతలతో సంప్రదించాలని భావించినప్పుడు కేఎన్నార్‌ ఈ నంబర్‌ ద్వారానే వారికి కాల్స్‌ చేస్తుండేవారు. ఈ నంబర్‌ సంగ్రహించిన ఏపీ చెందిన పండరి విష్ణుమూర్తి, గంగవరపు అరుణ్కుమార్, పిల్ల రామకృష్ణ, మార్తాండం జగదీష్‌ ముఠాగా ఏర్పడి నేరాలకు పాల్పడ్డారు. పోలీసులు దర్యాప్తు చేపట్టిగా... ఇటీవల ముమ్మిడివరం పోలీసులు ఈ నలుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు. హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు శనివారం ఆ నలుగురిని పీటీ వారెంట్‌పై హైదరాబాద్‌ తీసుకొచ్చారు. న్యాయస్థానంలో హాజరు పరిచి న్యాయమూర్తి ఆదేశాలతో జ్యుడీషియల్‌ రిమాండుకు తరలించారు.   

మరిన్ని వార్తలు