స్విమ్మింగ్‌ పూల్‌లో మునిగి బాలుడి మృతి

12 Jun, 2019 08:22 IST|Sakshi
మృతదేహం వద్ద రోదిస్తున్న తల్లి

సాక్షి, అరకులోయ (విశాఖపట్నం) : విహారయాత్ర ఓ కుటుంబంలో విషాదం నింపింది. టూరిజంశాఖకు చెందిన స్థానిక హరితవేలి రిసార్ట్స్‌లోని స్విమ్మింగ్‌పూల్‌లో ఈతకు దిగిన నాలుగేళ్ల బాలుడు  మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం 3గంటల సమయంలో జరిగింది. శ్రీకాకుళానికి చెందిన శంకరరావు, అతని భార్య,నాలుగేళ్ల కుమారుడు విహారయాత్రకు వచ్చి,మంగళవారం హరితవేలి రిసార్ట్స్‌లో బస చేశారు.

మధ్యాహ్నం భోజన విరామంలో ఈనాలుగేళ్ల బాలుడు గది నుంచి బయటకు వచ్చి ఒంటరిగానే స్విమ్మింగ్‌పూల్‌లోకి దిగాడు. ఆ తరువాత స్విమ్మింగ్‌ పూల్‌ వద్దకు తల్లిదండ్రులు వచ్చారు. ఈతకొడుతునే ఈ బాలుడు ఒక్కసారిగా నీట మునిగాడు.ఆ సమయంలో పర్యాటక సిబ్బంది,ఇతర అధికారులు ఎలాంటి సహాయక చర్యలు చేపట్టకపోవడంతో ఈ బాలుడు క్షణాల్లోనే మునిగిపోయాడు.తల్లిదండ్రులు చూస్తుండగానే ఈబాలుడు నీటమునిగి చనిపోవడంతో వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

స్విమ్మింగ్‌పూల్‌ నుంచి బాలుడిని బయటకు తీసి,స్థానిక ప్రాంతీయ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. బాలుడు మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు.ఈ సంఘటనతో తల్లడిల్లిన తల్లిదండ్రులు  బాలుడు మృతదేహాన్ని ఓ ఆటోలో    తరలించారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేయలేదు.హరితవేలి రిసార్ట్స్‌ మేనేజర్‌ అప్పలనాయుడు కూడా మృతిచెందిన బాలుడి వివరాలను బయటకు చెప్పడం లేదు. శ్రీకాకుళానికి చెందిన శంకరరావు పేరున రిసార్ట్స్‌లో ఓ గది బుక్‌ అయ్యింది.మిగతా వివరాలను టూరిజం అధికారులు గోప్యంగానే ఉంచారు.

మరిన్ని వార్తలు