యువతిపై నలుగురు యువకుల లైంగికదాడి  

5 Feb, 2019 02:57 IST|Sakshi

స్నేహితుడిని కొట్టి యువతిని ఎత్తుకెళ్లిన నిందితులు

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఘటన

నిర్భయ కేసు నమోదు.. నిందితుల కోసం గాలింపు 

సూళ్లూరుపేట: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో యువతిపై గ్యాంగ్‌ రేప్‌ ఘటన కలకలం రేపింది. సూళ్లూరు, బొగ్గులకాలనీకి చెందిన నలుగురు యువకులు ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు యువతిపై లైంగికదాడికి పాల్పడ్డారు. గూడూరు డీఎస్పీ బాబుప్రసాద్‌ సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. కాకినాడకు చెందిన 24 ఏళ్ల  యువకుడు, విజయనగరానికి చెందిన 20 ఏళ్లబాధితురాలు శ్రీసిటీ సెజ్‌లోని ఓ సెల్‌ఫోన్‌ కంపెనీలో పనిచేస్తున్నారు. స్నేహితులైన వీరు ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో రైల్వేస్టేషన్‌ ప్లాట్‌ ఫాం మీదున్న కుర్చీల్లో కూర్చుని ముచ్చటించుకుంటున్నారు. అదే సమయంలో సూళ్లూరు, బొగ్గుల కాలనీకి చెందిన నలుగురు యువకులు గంజాయి తాగిన మత్తులో ఆ యువకుడ్ని కొట్టి యువతిని బొగ్గుల కాలనీ వైపునకు తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఈ లోపు పోలీసుల గస్తీలో భాగంగా రైల్వేస్టేషన్‌ వైపు రావడంతో పోలీస్‌ సైరన్‌ విన్న బాధిత యువకుడు ఎస్‌ఐ పి.విశ్వనాథరెడ్డిని ఆశ్రయించి జరిగిన ఘటనను వివరించారు.

దీంతో సీఐ, ఎస్‌ఐ, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులొస్తున్నారని పసిగట్టిన నలుగురు యువకులు ఆ యువతిని బట్టల్లేకుండా కొంత దూరం నడిపించి అక్కంపేట రైల్వేస్టేషన్‌ సమీపంలోని ఓ టన్నెల్‌ కిందకు తీసుకెళ్లి తెల్లవార్లూ ఆమెపై పైశాచికంగా అత్యాచారం చేశారు. సోమవారం ఉదయాన్నే ఆ యువతిని అక్కంపేట రైల్వేస్టేషన్‌లో సబర్బన్‌ రైలు ఎక్కించి పంపారు. ఆదివారం రాత్రి నుంచి యువతి కోసం గాలిస్తున్న పోలీసులు ఆమెను గుర్తించి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించగా బోరున విలపిస్తూ తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. నిందితులపై నిర్భయ కేసు నమోదు చేసిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. బాధిత యువతిని వైద్య పరీక్షలు నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు.  

మరిన్ని వార్తలు