వజ్రాలు కొన్నాడు... డబ్బు ఎగ్గొట్టాడు

9 Aug, 2019 11:08 IST|Sakshi

బంజారాహిల్స్‌: కొనుగోలు చేసిన వజ్రాలకు సంబంధించి డబ్బు ఇవ్వకపోగా అడిగితే అంతు చూస్తానంటూ బెదిరిస్తున్నాడని నగరానికి చెందిన వజ్రాల వ్యాపారిపై గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్‌ రాష్ట్రం వెస్ట్‌ సూరత్‌లో నివసించే వజ్రాల వ్యాపారి వికాస్‌ చోప్రాకు మూడున్నరేళ్ళ క్రితం సోమాజి గూడలో వజ్రాల వ్యాపారం నిర్వహించే మదన్‌ సిసోడియాతో పరిచయం ఏర్పడింది. ఎనిమిదిసార్లు ఇద్దరూ కలిసి వజ్రాల వ్యాపారంలో భాగంగా లావాదేవీలు జరుపుకున్నారు.

2017 జూన్‌ 30న బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 2లో జరిగిన లావాదేవీల్లో భాగంగా వికాస్‌ చోప్రా తన వద్ద ఉన్న రెండు వజ్రాలను రూ. 24.72 లక్షలకు సిసోడియాకు విక్రయించాడు. ఇందుకు సంబంధించిన బిల్లుకూడా ఇచ్చాడు. రెండువారాలు దాటినా సిసోడియా డబ్బు ఇవ్వడంలో విఫలమయ్యాడు. దీంతో పలుమార్లు బాధితుడు ప్రశ్నించారు. కావాలనే మోసం చేశాడని తెలుసుకున్న బాధితుడు ఇంటికి వెళ్ళి ప్రశ్నించగా మరోసారి డబ్బు అడిగితే చంపేస్తానంటూ బెదిరించాడు. ఇటీవల ఫోన్‌ కాల్స్‌ కూడా స్వీకరించడం లేదు. పలు హెచ్చరికలతో కూడిన మెసేజ్‌లు పంపుతున్నాడని తనకు సిసోడియా నుంచి ప్రాణహాని ఉందని బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వజ్రాల వ్యాపారి మదన్‌సిసోడియాపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు