స్టాక్‌ మార్కెట్‌ పేరుతో ఆన్‌లైన్‌ మోసం

10 Aug, 2019 08:56 IST|Sakshi
పోలీస్‌లు అరెస్ట్‌ చేసిన నిందితులు

అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ఇద్దరు అరెస్ట్‌

దేశవ్యాప్తంగా రూ. 70 లక్షల మేర చీటింగ్‌

నాగోలు: స్టాక్‌ మార్కెట్‌ పేరుతో నకిలీ సంస్థను ఏర్పాటు చేసి స్టాక్‌ మార్కెట్‌ లో పెట్టబడులు పెడితే ఐదు రెట్ల వరకు సొమ్మును తిరిగి ఎక్కువ  చెల్లిస్తామని ఆన్‌లైన్‌ వేదికగా మోసానికి పాల్పడుతున్న బెంగుళూరుకు చెందిన ముఠాలోని ఇద్దరిని రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి ఐదు కంప్యూటర్లు, నాలుగు సెల్‌ఫోన్‌లు, ల్యాప్‌ట్యాప్, రెండు డీమాట్‌ అకౌంట్లతో పాటు ఇతర సామగ్రిని సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌లు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఎల్‌బీనగర్‌ లోని రాచకొండ సైబర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భువనగిరి డీసీపీ, రాచకొండ సైబర్‌ క్రైమ్‌ ఇంచార్జ్‌ డీసీపీ నారాయణరెడ్డి తెలిపిన మేరకు.. బీహార్‌కు చెందిన రాహుల్‌ కుమార్, చిత్తూరుకు చెందిన అనంత సూర్య చైతన్యలు బెంగుళూరులో డైరెక్ట్‌ నేషనల్‌ స్టాక్‌ రీసెర్చ్‌ కార్యాలయాన్ని స్థాపించారు. వీరితో పాటు అదే ప్రాంతానికి చెందిన దీపక్, చంద్రశేఖర్, విజయ్‌ రమేశ్, నారాయణ్‌ ను కంపెనీలో ఉద్యోగులుగా పెట్టుకున్నారు.

నేషనల్‌ స్టాక్‌ ఎక్ఛ్సేంజ్‌ పేరుతో వివిధ ప్రాంతాల్లోని డీమాట్‌ అకౌంట్‌ కలిగిన వారికి తరచు ఫోన్స్‌ చేస్తూ, మెయిల్స్‌ పెడుతూ తమ కంపెనిలో పెట్టుబడి పెడితే 28 రోజుల్లో 5 నుంచి 11 రెట్లు ఎక్కవ  డబ్బు వస్తాయని నమ్మలికారు. ఈ క్రమంలో నగరంలోని  ఉప్పల్‌ ప్రాంతానికి చెందిన సాఫ్‌వేర్‌ ఉద్యోగి శ్రావణ్‌ చిట్టిరెడ్డికి వాట్సప్, మెయిల్స్‌ ద్వారా తరచుగా మెసేజ్‌లో పెడుతూ కంపెనీలో పెట్టుబడి పెట్టాలని కోరారు.  ఇది నమ్మిన శ్రావణ్‌ చిట్టిరెడ్డి ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా రూ.1,82,116 ను జూలై నెలలో బదిలీ చేశారు. తదంతరం నేషనల్‌ స్టాక్‌ ఎక్చేంజ్‌ సంస్థ కార్యాలయం సభ్యులు స్పందించకపోవటంతో మోసపోయినట్లు గుర్తించి రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ లకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీస్‌లు బెంగుళూర్‌కు వెళ్ళి సంస్థ కార్యాలయాలు తనిఖీ చేయగా నేషనల్‌ స్టాక్‌ ఎక్ఛేంజ్, ఏంజెల్‌ బ్రోకింగ్‌ కంపెనీకి సంబంధం లేని నకిలీ సంస్థగా పోలీస్‌లు గుర్తించారు. దేశవ్యాప్తంగా డీమాట్‌ హోల్డర్‌ లను గుర్తించి వారి డేటాను కొనుగోలు చేసి మోసానికి పాల్పడుతున్నారని దేశవ్యాప్తంగా అనేక మందిని అన్‌లైన్‌ ద్యారా మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు ఆ ముఠా సభ్యులు సుమారు రూ.70 లక్షల వరకు మోసం చేశారు.  ప్రధాన నిందితులైన రాహుల్‌ కుమార్, అనంత సూర్యచంద్ర లను అరెస్ట్‌ చేశారు. సమావేశంలో సైబర్‌ క్రైమ్‌ సీఐ లు కె.వి.విజయ్‌కుమార్, లక్ష్మీకాంత్‌ రెడ్డి, ప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు