రైల్వేలో ఉద్యోగాల పేరిట మోసం   

19 May, 2018 12:46 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

 రూ.40 లక్షలతో నిందితుడు పరారీ

సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు

నిజమైన ‘సాక్షి’ కథనం

కాజీపేట అర్బన్‌ : రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసి ఓ వ్యక్తి రూ.40 లక్షలతో ఫరారీ అయిన ఘటనలో శుక్రవారం సుబేదారి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై గురువారం ‘సాక్షి’ ప్రచురితమైన కథనం అక్షర సత్యమైంది.  సుబేదారి ఎస్సై సిరిపురం నవీన్‌కుమార్‌ కథనం ప్రకారం.. హన్మకొండ పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ ఎదుట హన్మకొండకు చెందిన ఎండీ.రఫీక్‌ టీస్టాల్‌ నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.

హన్మకొండ భవానీనగర్‌కు చెందిన తిరుపతిరెడ్డి తరచూ రఫిక్‌ టీస్టాల్‌ వద్ద వస్తుండే వాడు. ఈ క్రమంలో తిరుపతిరెడ్డి కుమారుడు వినిత్‌రెడ్డి తన స్నేహితులు వాసుదేవరెడ్డి, రాజు తదితురలు రఫీక్‌ టీస్టాల్‌ వద్ద కలుసుకునేవారు. టీ తాగుతున్న తరుణంలో బిటెక్‌ పూర్తి చేసిన తమను నిరుద్యోగం వేదిస్తుందని, రైల్వే లాంటి శాఖలో ఉద్యోగం లభిస్తే బాగుండు అనే అభిరుచులను పంచుకునేవారు.

దీనిని గమనించి టీస్టాల్‌ యజమాని రఫీక్‌ తనకు రైల్వే శాఖలో ఉన్నతాధికారులు చాలా మంది పరిచయం ఉన్నారంటూ తమ బంధువులు సైతం ఉన్నతాధికారులుగా కొనసాగుతున్నారని నమ్మించాడు. అలా 2015 ఆ యువకుల నుంచి దశల వారీగా సుమారు రూ.40 లక్షలను వసూలు చేసి చాయ్‌వాలా చేతివాటాన్ని చూపాడు.

రోజులు గడుస్తున్నా.. ఉద్యోగాలు రాకపోవడంతో మోసపోయామని గమనించిన నిరుద్యోగులు రఫీక్‌ను నిలదీశారు. దీంతో రఫీక్‌ రాత్రికిరాత్రే మకాం మార్చేశాడు. శుక్రవారం బాధితుడు తిరుపతిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.   

మరిన్ని వార్తలు