పార్ట్‌టైమ్‌ ఉద్యోగాల పేరిట మోసం

11 Apr, 2018 08:35 IST|Sakshi
టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద బాధితులు   

లక్షలాది రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పిన సంస్థ

లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించిన బాధితులు

అల్లిపురం(విశాఖ దక్షిణ): మీరు ఇంటి వద్దే ఉంటూ ఖాళీ సమయాల్లో పనిచేస్తూ డబ్బు సం పాదించండి... విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగులు అదనపు ఆదాయం సంపాదించవచ్చు... అంటూ ప్రకటనలతో ఆకట్టుకుని ఒక సంస్థ లక్షలాది రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసింది.

దీంతో బాధితులు లబోదిబోమంటూ రెండో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... అల్లిపురం జైలురోడ్డులో కోల్‌కత్తాకు చెందిన ఎస్‌ఎస్‌ కమ్యూనికేషన్‌ పేరిట ఒక కార్యాలయం ప్రారంభించారు.

వారు నిరుద్యోగ యువత, గృహిణులు, చిరుద్యోగుల నుం చి పార్ట్‌ టైం వర్కు చేసి అదనపు ఆదాయం సంపాదించండి అంటూ రూ.6వేల నుంచి రూ.40వేల వర కు డిపాజిట్‌లు సేకరించారు. డిపాజిట్‌ చేసిన నగదు మళ్లీ కావాల్సినప్పుడు వెనక్కు తీసుకోవచ్చని... అంతవరకు నెలకు రూ.9వేల నుంచి రూ.36వేల వరకు సంపాదించుకోవచ్చని ఆశ చూపించారు.

రోజ్‌వాటర్‌ తయారీ, ఎల్‌ఈడీ ప్యానెల్స్, ఎల్‌ఈడీ స్ట్రిప్‌ లైట్లు, సీఎఫ్‌ఎల్‌ బల్బు తయారీ, ఎల్‌ఈడీ బల్బుల తయారీ ప్యాకింగ్‌కు ముడి సరకు అందిస్తామన్నారు. దీంతో వంద మందికి పైగా సభ్యులు ఆ సంస్థలో ఈ నెల 7, 8వ తేదీల్లో డబ్బులు చెల్లించారు.

అందుకు సంస్థ తరఫున రసీదులు కూడా ఇచ్చారు. మంగళవారం ఉదయం సంబంధిత కార్యాలయానికి ముడి సరుకు తీసుకొనేందుకు వెళ్లగా మూసి ఉంది. దీంతో బాధితులంతా లబోదిబోమంటూ టూటౌన్‌ పోలీసులను ఆశ్రయించారు.

బాధితుల  ఫిర్యాదు మేరకు విచారణ చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. నిందితుడు అనకాపల్లిలో ఉన్నాడని బాధితులు ఇచ్చిన సమాచారం మేరకు సిబ్బందిని అక్కడికి పంపించినట్లు పోలీసులు తెలిపారు.  

మరిన్ని వార్తలు