గొర్రె చెవికి పోగులు.. ప్రభుత్వం చెవిలో పువ్వులు!

28 May, 2018 13:00 IST|Sakshi
గొర్రెల పంపిణీ దృశ్యం(ఫైల్‌)

నారాయణపేట రూరల్‌ (మహబూబ్‌ నగర్‌) : వెనకబడిన కులాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కురుమ యాదవులకు అందించిన సబ్సిడీ గొర్రెల పథకం నీరుగారుతుంది. లొసుగులను అడ్డం పెట్టుకుని అధికారులతో కుమ్ముక్కై పాత గొర్రెలనే సబ్సిడీ కింద కొనుగోలు చేస్తున్నట్లు చూయించి గొర్రె చెవుకు పోగులు వేసి ప్రభుత్వం చెవిలో పువ్వులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆదివారం కర్ణాటక రాష్ట్రానికి ఆరు వాహనాల్లో గొర్రెలు పోయినట్లు స్థానికులు చెబుతున్నారు.

కొల్లంపల్లి, ధన్వాడ, మరికల్‌తోపాటు పలువురు మేత కోసం గుంటూరు, కరీంనగర్, విజయవాడ ప్రాంతాలకు గొర్రెలను తీసుకువెళ్తారు.  అయితే ఇటీవల గొర్రెల పథకంలో రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్‌ నిర్ణయించడంతో వెటర్నరీ డాక్టర్లు వాటిని పూర్తి చేయడం కత్తిమీద సాములా మారింది. పైగా పెద్ద మొత్తంలో గొర్రెలు అవసరం ఉండటంతో పలుచోట్ల రోజుల తరబడి ఎంపీడీఓ, తహసీల్దార్‌తో కలిసి బృందాలు పర్యటించి పరిశీలించిన అందుకు తగిన గొర్రెలు దొరకలేదు.

ఈ మేరకు గొల్ల కురుమలతో అధికారులు మాట్లాడుకుని రాత్రికి రాత్రి అక్కడికి తరలించి కర్ణాటకలోని వ్యక్తులతో కొనుగోలు చేసినట్లు పత్రాలు సృష్టించి అక్కడి వ్యక్తుల అకౌంట్లోకి డబ్బులు బదిలీ చేయిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పేట శివారులో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 20 గొర్రెలు మృతిచెందిన సంఘటనకు సంబంధించి లోతుగా పరిశీలిస్తే కర్ణాటకకు మేత పేరుతో తీసుకువెళ్తున్నట్లు తెలిసింది.

వాస్తవానికి ప్రమాదం జరిగిన సమయంలో 20 గొర్రెలు ఊపిరి ఆడక చనిపోతే రికార్డులో మాత్రం 8 గొర్రెలుగా నమోదు చేశారు. గొర్రెల తరలింపు వ్యవహారంలో లోతుగా విచారణ చేస్తే నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.  

>
మరిన్ని వార్తలు