నేపాల్‌ వాసికి అంత్యక్రియలు

18 Sep, 2019 10:50 IST|Sakshi
రమేష్‌ మృతదేహానికి అంత్యక్రియలు చేస్తున్న రవి

స్పందించిన రవి తాప

సాక్షి, హైదరాబాద్‌: నేపాల్‌ నుంచి పొట్ట చేతబట్టుకొని నగరానికి వచ్చిన రమేష్‌(32) అనే యువకుడు మూడు రోజుల క్రితం జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.5లోని మెట్రోస్టేషన్‌ పార్కింగ్‌లో మృతి చెందాడు. ఇతడి భార్య మీనా తల్లిదండ్రులు ఇటీవల మృతి చెందడంతో ఆమె నేపాల్‌లో ఉంది. భర్త మరణ వార్త తెలిసిన ఆమె అక్కడి నుంచి రాలేని పరిస్థితుల్లో కన్నీరుమున్నీరైంది. రమేష్‌ బంధుమిత్రులు ఇక్కడే ఉన్నా మృతదేహాన్ని నేపాల్‌కు తరలించే ఆర్థిక స్తోమత లేదు. దీంతో హైదరాబాద్‌లోనే అంత్యక్రియలు చేయాలంటూ మృతుడి భార్య సూచించింది. ఇక్కడ అంత్యక్రియల ఖర్చులు భారం కావడంతో బంధుమిత్రులు కూడా చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలో యూసుఫ్‌గూడకు చెందిన రవి తాప అనే సంఘసంస్కర్త పంజగుట్ట స్మశాన వాటికలో దగ్గరుండి చితికి నిప్పంటించి హైందవ సంస్కృతి ప్రకారం అంత్యక్రియలు తంతు పూర్తి చేశారు. ఎక్కడో పుట్టి ఇక్కడికి వచ్చి తనకు సంబంధం లేని వారితో ఇలా అంత్యక్రియలు నిర్వహించుకున్న రమేష్‌ పరిస్థితిని చూసినవారు కంట తడిపెట్టారు.  

మరిన్ని వార్తలు