మాస్క్ పెట్టుకోమ‌న్నందుకు ప్రాణం తీశారు

11 Jul, 2020 12:04 IST|Sakshi

బయోన్నె : బ‌స్సులో ఎక్కిన ప్ర‌యాణికుల‌కు మాస్క్ పెట్టుకోవాల‌ని సూచించిన‌‌ బ‌స్ డ్రైవ‌ర్‌ను ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా చిత‌క‌బాదారు. గాయ‌ప‌డిన ఆ వ్య‌క్తి ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ శుక్ర‌వా‌రం కన్ను‌మూశాడు. త‌మ మంచి కోసం చెప్పినా అర్థం చేసుకోకుండా ఒక మ‌నిషి నిండు ప్రాణం అన్యాయంగా తీసిన‌ ఘ‌ట‌న ప్రాన్స్‌లో చోటుచేసుకుంది.

వివ‌రాలు.. 59 ఏళ్ల ఫిలిప్పే మంగీల్లాట్ వృత్తి  రిత్యా బ‌స్ డ్రైవ‌ర్‌గా పనిచేస్తున్నాడు. ఫ్రాన్స్‌లోని బయోన్నెకు బ‌స్ న‌డుపుతుంటాడు. ఈ సంద‌ర్భంగా వారం కింద‌ట ఫిలిప్పే న‌డుపుతున్న బ‌స్సులోకి ముగ్గురు వ్య‌క్తులు ఎక్కారు. అయితే ముగ్గురు మాస్కులు ధ‌రించ‌క‌పోవ‌డంతో వెంట‌నే మాస్కులు ధ‌రించాల్సిందిగా ఫిలిప్పే తెలిపాడు. మీరు మాస్కు ధ‌రించ‌క‌పోతే బ‌స్సు ముందుకు క‌ద‌ల‌ద‌ని, ఇక్క‌డే దింపేస్తాన‌ని పేర్కొన్నాడు. దీంతో ఆగ్ర‌హించిన ముగ్గురు వ్య‌క్తులు ఫిలిప్పేపై ఇనుప‌రాడ్‌తో విచ‌క్ష‌ణార‌హితంగా కొట్టారు. త‌ల‌కు బ‌ల‌మైన గాయం కావ‌డంతో అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లిన ఫిలిప్పేను అక్క‌డే వ‌దిలేసి ఆ ముగ్గురు ప‌రార‌య్యారు.(గొంతు కోసి.. అడవిలో వదిలేసి)

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థలానికి చేరుకొని ఫిలిప్పేను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. పోలీసులు ఈ విష‌యాన్ని అత‌ని కుటుంబ‌స‌భ్యుల‌కు చేర‌వేశారు. కాగా చికిత్స పొందుతున్న ఫిలిప్పేకు త‌ల‌కు బ‌ల‌మైన గాయం కావ‌డంతో బ్రెయిన్ డెడ్ అయింద‌ని డాక్ఠ‌ర్లు పేర్కొన్నారు. శుక్ర‌వారం కుటుంబ‌స‌భ్యుల అనుమ‌తితో ఫిల‌ప్పేకు  వెంటిలేట‌ర్ తొల‌గించిన కాసేప‌టికే మృతి  చెందిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఫిలిప్పేపై విచ‌క్ష‌ణార‌హితంగా దాడికి పాల్ప‌డ్డ ముగ్గురు వ్య‌క్తుల‌పై మ‌ర్డ‌ర్ కేసు కింద కేసు న‌మోదు చేశామ‌ని, వారి కోసం గాలిస్తున్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.

మరిన్ని వార్తలు