స్నేహితురాలని నమ్మితే దోచేసింది..

13 May, 2018 09:38 IST|Sakshi
నిందితులు సరితాదేవి, నర్సింహ

నగలు కాజేసిన మహిళ అరెస్ట్‌

14 తులాల అభరణాలు స్వాధీనం

మన్సూరాబాద్‌: స్నేహితురాలని నమ్మి ఇంటిని అప్పగిస్తే ఇంట్లోని బంగారు అభరణాలు దోచుకుపోయిన మహిళను, దొంగ సొత్తును కొన్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. శనివారం ఎల్‌బీనగర్‌ డీసీపీ వెంకటేశ్వరావు శనివారం తెలిపిన వివరాల ప్రకారం... సరూర్‌నగర్‌ కొత్తపేట హుడా కాంప్లెక్స్‌లోని క్రాంతిహిక అపార్ట్‌మెంట్‌లో నివాసముండే జంపన శ్రీవిద్య, హుడాకాలనీలోని రామ్‌మోహన్‌ టవర్స్‌లో ఉండే వంగవోలు సరితాదేవి(21) స్నేహితులు.  సవితాదేవి కొంత కాలం పాటు వివిధ విద్యాసంస్థలలో పనిచేసి ఆరోగ్యం బాగుండక ఉద్యోగం మానేసింది. శ్రీవిద్య ఇంటికి సరితాదేవి తరచూ వస్తుండేది. ఈ క్రమంలో శ్రీవిద్య సరితాదేవిని నమ్మి అప్పడప్పుడు ఇంటిని ఆమెకు అప్పచెప్పి సొంత పనులపై వెళ్లేది. అయితే తన వైద్యం కోసం అవసరమైన డబ్బుల కోసం చోరీ చేయాలని సరితాదేవి పథకం వేసింది.

ఈ క్రమంలో గతేడాది ఆగస్టులో శ్రీవిద్య తన ఇంటిని సవితాదేవికి అప్పచెప్పి బయటకు వెళ్లింది. ఇదే అదనుగా భావించి శ్రీవిద్య బెడ్‌రూంలోని చీరల మధ్య దాచిన బంగారు అభరణాలను ఎత్తుకుపోయింది. వీటిని సమీపంలోని మెడికల్‌ దుకాణంలో పనిచేసే గోషిక నర్సింహకు రూ.75 వేలకు కొన్ని నగలు అమ్మి జల్సాలు చేసుకుంది. కొన్ని రోజులకు శ్రీవిద్య తన నగల కోసం వెతగ్గా కనిపించక పోవడంతో సరూర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసి సవితాదేవిపై అనుమానం వ్యక్తం చేసింది. దీంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు నిందితురాలు సరితాదేవి, దొంగ బంగారం కొనుగోలు చేసిన నర్సింహను అరెస్టు చేసి వారి నుంచి 14 తులాల బంగారు అభరణాలతో పాటు రూ.4.2 లక్షల విలువగల సొత్తను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో ఎల్‌బీనగర్‌ ఏసీపీ పృధ్వీందర్‌రావు, సరూర్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ రంగస్వామి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు